ఏపీ స్ధానిక పోరుకు ముందే పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారా ?
ఏపీలో స్ధానిక పోరుకు ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. స్ధానిక ఎన్నికల్లో అక్రమాల నివారణ పేరుతో ఈసారి ప్రభుత్వం అతి తక్కువ సమయం మాత్రమే ఇస్తోంది. ఇందులో నెగ్గాలంటే ప్రతీ నిమిషం కీలకమే. కానీ పవన్ ఏం చేస్తున్నారు ?

స్ధానిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా ?
గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన దారుణ పరాజయాలను మూటగట్టుకుంది. స్వయంగా అధినేత పవన్ తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓటమి పాలయ్యారు. 141 స్ధానాల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీకి జై కొట్టడంతో జనసేన పరిస్ధితి అత్యంత నామమాత్రంగా మారింది.

స్ధానిక పోరులో జనసేన పోటీ చేస్తుందా
ఏపీలో కాస్త అటు ఇటుగా ఈ నెలాఖరు లోపు స్ధానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలింగ్, ఫలితాల వరకూ కేవలం 10 నుంచి 15 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే క్షేత్రస్ధాయిలో క్యాడర్ ఉన్న పార్టీలు మాత్రమే ఈ పోరులో ప్రభావం చూపే అవకాశముంటుంది. కానీ జనసేన పరిస్ధితి అలా కాదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే చాలా నియోజకవర్గాల్లో జనసేనకు పోలింగ్ ఏజెంట్లే కరువయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయంతో ఉన్న కాస్తో కూస్తో ప్రభావం చూపగల నేతలంతా దూరమయ్యారు. దీంతో ఈసారి స్ధానిక ఎన్నికల్లో జనసేన అసలు పోటీ చేస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

మిత్రపక్షం బీజేపీ పరిస్ధితీ దొందూదొందే..
జనసేన పరిస్ధితి ఇలా ఉంటే దాని మిత్రపక్షం బీజేపీ పరిస్ధితి మరీ తీసికట్టుగా ఉంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్ధానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇప్పటివరకూ కోలుకోలేకపోయింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్న జనసేనను మిత్రపక్షంగా చేసుకుని తానూ పోరు ప్రారంభించింది. అయితే క్షేత్రస్ధాయిలో ఇరుపార్టీలు సంయుక్తంగా పోరాటం చేసిన సందర్భాలు మాత్రం లేవు. దీంతో స్ధానిక పోరులోనూ వీరిద్దరి మధ్య సమన్వయం అనుమానంగానే ఉంది.
Recommended Video


జనసేన పోటీ చేయకపోతే టీడీపీకి మద్దతిస్తుందా ?
జనసేన పార్టీ స్ధానిక ఎన్నికల పోరులో బరిలో ఉండకపోతే ఏం చేయబోతోందన్నదీ ఇప్పుడు ఆసక్తికరమే. గతంలో 2014 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీకి మద్దతిచ్చిన జనసేన.. మరోసారి అదే పని చేస్తుందా లేక టీడీపీని దూరంగా ఉంచుతున్న బీజేపీ నిర్ణయాన్ని గౌరవిస్తుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. లేకపోతే వీరిద్దరూ కలిసి టీడీపీకి మద్దతు ఇస్తారా అన్నదీ తేలాల్సి ఉంది.
మొత్తం మీద విపక్షాల అనైక్యత అధికార వైసీపీకి కలిసివచ్చే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications