పవన్ దానికి కట్టుబడి ఉండగలరా?: 'జేఏసీ' అలా నిగ్గదీసి అడిగితే ఎటువైపు నిలబడతారు?
విజయవాడ: జేఏసీని ఏర్పాటు చేయాలన్న పవన్ కల్యాణ్ ఆలోచన బాగానే ఉంది కానీ.. దాని పోరాటం ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపినా పవన్ కల్యాణ్ దానికి కట్టుబడి ఉండగలరా?.. ఆ వాదనల్ని ముందుకు తీసుకెళ్లగలరా? అన్న ప్రశ్నలు తెర పైకి వస్తున్నాయి. ఆచరణలో ఆ బాధ్యత తీసుకోకుండా జేఏసీ ప్రతిపాదన కేవలం మాటలకే సరిపెట్టడం సరికాదంటున్నారు.
Recommended Video
మేదావులతో:
మేధావులతో జేఏసీ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. కానీ మేదావి వర్గం అటు కేంద్రాన్నే కాదు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెనకేసుకురాదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గ్రహించాలి.
సమస్యల మూలాల గురించి మాట్లాడాలంటే అధికార పార్టీ వైఫల్యాల గురించి కూడా మాట్లాడక తప్పదు. అదే జరిగితే పవన్ కల్యాణ్ జేఏసీ స్టాండ్కు కట్టుబడి ఉండగలరా? అన్నది అందరిలోనూ వ్యక్తమవుతోన్న ప్రశ్న.
బాబు మీద సానుభూతి:
నిజానికి పవన్ కల్యాణ్ వైఖరి ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సీఎం చంద్రబాబుకు అనుకూలంగానే ఉందన్నది జగమెరిగిన సత్యం. నిన్నటికి నిన్న 'చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని.. మద్దతు ఉపసంహరించుకోవడానికి తామేమి ప్రభుత్వంలో లేము కదా..' అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంటే, పరోక్షంగా చంద్రబాబు పట్ల పవన్ మళ్లీ సానుకూల వైఖరినే కనబరిచినట్టు అర్థమవుతోంది.
పవన్ సమర్థించగలరా?..:
ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ్ లాంటివాళ్లతో జేఏసీ ఏర్పాటవ్వాలనేది పవన్ ఆలోచన. ఆలోచన బాగానే ఉంది కానే.. వాళ్లు టీడీపీపై విమర్శలు ఎక్కుపెడితే పవన్ కల్యాణ్ కూడా వాటిని సమర్థించగలరా?.. లేక ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఇష్టం లేదన్న పస లేని వ్యాఖ్యలు చేస్తారా? అన్నది ప్రశ్న.
నిగ్గదీసి అడగడానికా?.. లేక..
ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు ఇప్పటికే చాలా సభలు, మీడియా సమావేశాల్లో చంద్రబాబు పాలనను కడిగిపారేశారు. ఇప్పుడు జేఏసీ ఏర్పాటైతే ఈ ఇద్దరు క్రియాశీలకంగా మారితే చంద్రబాబుకు విమర్శలు తప్పవు.
హోదా నుంచి ప్యాకేజీ వరకు చంద్రబాబు ప్రభుత్వం ఎలా విఫలమైందీ జనాలకు చెప్పగలరు. కాబట్టి ఇలా నిగ్గదీసి అడిగే జేఏసీని పవన్ కోరుకుంటున్నారా?.. లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని నొప్పించకుండా కేవలం కేంద్రంతోనే ఫైట్ చేయాలని చెబుతారా?.. అలా అయితే ప్రభుత్వ వైఫల్యాలను ఆయన సమర్థిస్తున్నట్టే కదా అన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లవా?...