తెర పైకి 'బ్రహ్మానందరెడ్డి': నంద్యాల బరిలో? భూమా చిన్న కుమార్తె కూడా!?
ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందిన జగత్ డెయిరీ వ్యవహారాలను బ్రహ్మానందరెడ్డి చూసుకుంటున్నారు.
నంద్యాల: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఏర్పడిన నంద్యాల ఉపఎన్నిక ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైసీపీ కూడా బరిలో దిగుతామని ప్రకటించడంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో తొలుత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర పైకి రాగా.. తాజాగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరు తెర పైకి రావడం గమనార్హం. నిజానికి శోభా నాగిరెడ్డి చనిపోయిన సమయంలోను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేందుకు బ్రహ్మానందరెడ్డి ఆసక్తి కనబరిచారు. అయితే భూమా పెద్ద కుమార్తె అఖిలప్రియకు ఆ స్థానం కేటాయించడంతో బ్రహ్మానందరెడ్డి వ్యాపారాల్లోనే మునిగిపోయారు.

ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందిన జగత్ డెయిరీ వ్యవహారాలను బ్రహ్మానందరెడ్డి చూసుకుంటున్నారు. భూమా మరణంతో ఖాళీ అయిన నంద్యాల స్థానంలో పోటీ చేసేందుకు బ్రహ్మానందరెడ్డి కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేత, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి బ్రహ్మానందరెడ్డి అల్లుడు కావడం విశేషం. బ్రహ్మానందరెడ్డి గనుక ఎన్నికల బరిలో నిలిస్తే.. కాటసాని వర్గం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించే అవకాశముంది.
ఏదేమైనా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయం కాబట్టి.. బరిలో ఎవరిని నిలపాలనేది ఆయనే నిర్ణయించనున్నారు. సానుభూతి ప్రకారం చూసుకుంటే భూమా చిన్న కుమార్తెను బరిలో నిలిపే అవకాశం ఉన్నప్పటికీ.. తాజాగా బ్రహ్మానందరెడ్డి పేరు తెరపైకి రావడంతో చంద్రబాబు తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications