అంచనా వేయకపోతే జగన్కు ప్రమాదమే: 'శిల్పా'తో బాబు వ్యూహం.. పార్టీ మారేది అందుకేనా?
జగన్ గనుక గుడ్డిగా శిల్పామోహన్ రెడ్డిని నమ్మితే భవిష్యత్తులో ఇలాంటి ప్రతికూలతలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆధిపత్యం కోసం పార్టీలు మారేవారి కన్నా.. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసేవారైతేనే జగ
నంద్యాల: నిలువెల్లా అనిశ్చితి తొణికిసలాడే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. తెల్లారేసరికే భుజం మీద కండువాలు మారిపోతున్న 'సీన్'లు ఇప్పటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. అధికార పార్టీల్లో ఉండటం ద్వారా రాజకీయంగా ఎటువంటి ఢోకా ఉండదని భావించే నేతలంతా.. ఆయా పార్టీల ఆకర్ష్ వలలో పడిపోతూ వచ్చారు.
బాబుకు శిల్పామోహన్ షాక్: రెండ్రోజుల్లో జగన్ పార్టీలోకి, అంతా అఖిలప్రియ వల్లే!
కానీ ఏపీలోని నంద్యాల రాజకీయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కేసుల భయమో, మరేమో తెలియదు గానీ దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరితే.. ఇప్పుడు నంద్యాల సీటు కోసం టీడీపీ నుంచి వైసీపీలోకి మారిపోతున్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శిల్పామోహన్ రెడ్డి.
భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉపఎన్నికలో పార్టీ తనకే టికెట్ ఇస్తుందని భావిస్తూ వచ్చిన ఆయనకు.. పార్టీ అధిష్టానం ప్రతికూలంగా వ్యవహరించడం ఏమాత్రం మింగుడుపడలేదు. ఓవైపు అఖిలప్రియ జోరు రోజురోజుకు పెరిగిపోతుండటం.. ఆమె సూచించినట్లుగానే భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చే సూచనలు కనిపిస్తుండటంతో.. ఇక పార్టీలో ఉండటం అనవరసరమని శిల్పా భావించినట్లు తెలుస్తోంది.
పైపైన చూస్తే ఎవరికైనా ఇంతకుమించి బోధపడదు. కానీ గత పరిణామాలను గనుక పరిగణలోకి తీసుకుంటే.. భవిష్యత్తులో శిల్పామోహన్ రెడ్డి మళ్లీ టీడీపీ గూటికి చేరకపోరా? అన్న సందేహం కలగకమానదు. అదీగాక, ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నుల్లో జరుగుతున్న వ్యవహారంగాను అనిపించకమానదు. ప్రతిపక్షానికి ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి.. తీరా గెలిచాక తమ పార్టీలోకి లాగేసుకోవాలనే వ్యూహం కూడా దీని వెనకాల ఉండవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జగన్ గనుక గుడ్డిగా శిల్పామోహన్ రెడ్డిని నమ్మితే భవిష్యత్తులో ఇలాంటి ప్రతికూలతలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆధిపత్యం కోసం పార్టీలు మారేవారి కన్నా.. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేసేవారైతేనే జగన్కు మేలు అనేది పలువురి వాదన. అలా కాకుండా.. వైసీపీ తరుపున శిల్పాను గెలిపించుకుని.. తీరా చంద్రబాబు ఆయన్ను లాగేసుకున్నాక.. అప్పుడు ఎంత విమర్శించినా లాభముండదు. ఏదేమైనా శిల్పామోహన్ రెడ్డి వైసీపీలో చేరుతుండటంతో నంద్యాల రాజకీయం మరింత రసకందాయంలో పడుతుందనడంలో అతిశయోక్తి లేదు.