మోడీకి శుభాకాంక్షలు: బిజెపితో జగన్ కనెక్ట్ అవుతున్నారా?
హైదరాబాద్: తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడితో బిజెపి కయ్యానికి కాలు దువుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబు పట్ల మెతగ్గా ఉంటూ, రాష్ట్ర స్థాయిలో మాత్రం విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబుకు బిజెపి పొమ్మనలేక పొగ పెడుతుందనే అభిప్రాయం క్రమంగా బలపడుతూ వస్తోంది. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజెపికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసోంలో బిజెపి విజయం సాధించినందుకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే జగన్కూ బిజెపికీ మద్య ఏదైనా రహస్య అవగాహన కుదిరిందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఇంచార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఆ అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని కూడా తప్పు పట్టారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పచ్చజెండా ఊపకుండా సిద్ధార్థనాథ్ సింగ్ చంద్రబాబుపై అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయబోరని అంటున్నారు. చంద్రబాబు తనంత తానుగా పొత్తును విచ్ఛిన్నం చేసుకునే విధంగా బిజెపి వ్యవహరిస్తోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇది గ్రహించబట్టే చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
చంద్రబాబు ఇప్పటికిప్పుడు బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధంగా లేరని ఆయన వ్యవహారశైలి చూస్తుంటే అర్థమవుతోంది. కేంద్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువ సాయం రాబట్టడానికే కాకుండా, తాను బిజెపితో స్నేహంగా ఉంటూ రాష్ట్రానికి అన్ని విధాలా సహకారం కోరానని చెప్పి ఎన్నికలకు ముందు ఆయన తెగదెంపులు చేసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇప్పుడే తెగదెంపులు చేసుకుంటే, ఎదురుదాడి మాత్రమే కాకుండా ప్రత్యక్ష యుద్ధం ప్రకటించడానికి బిజెపి రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు వంటి నేతలు నేరుగా చంద్రబాబుపై, టిడిపిపై ధ్వజమెత్తుతూ వస్తున్నారు. తెగదెంపులు చేసుకుంటే వారు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ వంటి నాయకులు నేరుగా చంద్రబాబు ప్రభుత్వంపై సమరానికి శంఖం పూరించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే టిడిపికి నష్టం జరగవచ్చు. దాంతో చంద్రబాబు బిజెపితో విడిపోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.
అదే సమయంలో తాను దూరమైన వెంటనే జగన్ బిజెపికి మరింత దగ్గర కావచ్చుననే ఆలోచన కూడా చంద్రబాబును వెనక్కి లాగుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి, జగన్ చేస్తున్న ప్రయత్నం కూడా అదే. చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకునే విధంగా చాలా కాలంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏమైనా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు త్వరలోనే ఓ మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.