పత్తిపాటి ఎఫెక్ట్, రివర్స్: సవాల్ చేసి జగన్ ఇరుకున పడ్డారా, సెల్ఫ్గోల్?
మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన ఆరోపణల అంశంపై వైసిపి అధినేత జగన్ పలాయవాదం వినిపిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వైసిపి పత్తిపాటిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
అమరావతి: మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన ఆరోపణల అంశంపై వైసిపి అధినేత జగన్ పలాయవాదం వినిపిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వైసిపి పత్తిపాటిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
అగ్రిగోల్డ్ కేసు నడుస్తున్నప్పుడు మంత్రి పత్తిపాటి తన భార్య పేరిట ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించారు. అయితే, ఎలాంటి వివాదం లేని ఆస్తులను తాను కొన్నానని పత్తిపాటి వివరణ ఇచ్చారు.
తాను అక్రమంగా కొన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, లేదంటే జగన్ రాజీనామా చేయాలని గురువారం సభలో సవాల్ విసిరారు. తన అక్రమాలు నిరూపించాలని అప్పుడు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేదంటే జగన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కూడా ఇదే అంశంపై టిడిపి పట్టుబట్టింది.
కానీ, పత్తిపాటి విషయంలో జగన్ తీరు చూస్తుంటే పలాయనవాదంగా కనిపిస్తోందనేది టిడిపి నేతల వాదన. నిన్న పత్తిపాటి సవాల్ విసిరితే జగన్ ఆ సవాల్ను స్వీకరించలేదని గుర్తు చేస్తున్నారు.
జ్యూడిషియల్ విచారణకు సిద్ధమన్నా..
జగన్ డిమాండ్ చేసిన జ్యూడిషియల్ విచారణకు సిద్ధమన్నా ఆయన స్పందించలేదని అంటున్నారు. ఇక, స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై సాక్షి తప్పుడు ప్రచారం చేసిందని, అందుకు సంబంధించిన కోడెల వీడియో ప్లే చేస్తే వెళ్లిపోయారని, ఇది పలాయనవాదమేనని టిడిపి చెబుతోంది.
సభలో ఎవరో ఒకరే
జగన్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలను కూడా టిడిపి ప్రశ్నిస్తోంది. పత్తిపాటిపై చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదంటే, సభలో ఉండవద్దని టిడిపి నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ విషయంలో తగ్గేది లేదంటున్నారు.
ఆ సవాళ్లను లాగిన జగన్
జగన్ మాత్రం.. తాను పత్తిపాటి విషయంలోనే కాదని, గతంలోను ఎన్నో సవాళ్లు చేశానని వాటికి టిడిపి ఎందుక స్పందించలేదని ప్రశ్నించారు. 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశానని చెప్పారు.
గతంలోనూ సవాళ్లు చేశా
అలాగే, తనపై 43 వేల కోట్ల అక్రమాస్తులు అంటూ ప్రచారం చేశారని, దానిని నిరూపిస్తే 10 శాతం ఆస్తులు రాసిస్తానని సవాల్ చేశానని, అప్పుడు కూడా టిడిపి ఇంత ఘాటుగా స్పందించలేదని జగన్ అంటున్నారు.
ఇక, గురువారం అగ్రిగోల్డ్ బాధితుల నిరసనలో మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన రికార్డులనే తాను అసెంబ్లీలో చెప్పానని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలను, తీరును చూస్తుంటే ఆయన సెల్ప్ గోల్ చేసుకుంటున్నారని అర్థమవుతోందని కొందరు అంటున్నారు.
అడిగి ఇరుకున పడ్డారా?
పత్తిపాటిపై చేసిన ఆరోపణలకు జ్యూడిషియల్ విచారణ జరపాలని ప్రతిపక్ష నేత జగనే స్వయంగా సవాల్ చేశారని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని టిడిపి నేతలు చెప్పారు. శుక్రవారం సభలో అచ్చెన్నాయుడు ఈ విషయం మరోసారి చెప్పారు. అయితే వైసిపి నేత చెవిరెడ్డి మాత్రం సవాళ్లు, ప్రతి సవాళ్లు పార్లమెంటరీ సంప్రదాయంలో ఉన్నాయా అని, ఉంటే రూలింగ్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. తద్వారా జగనే అడిగి ఇరుకున పడ్డారని అంటున్నారు.
జగన్కు అల్టిమేటం
మంత్రి పత్తిపాటి పుల్లారావుపై చేసిన ఆరోపణలపై జగన్కు అధికార పార్టీ అల్టిమేటం జారీ చేసిందని చెప్పవచ్చు. పత్తిపాటిపై చేసిన ఆరోపణలకు జగన్ క్షమాపణ చెప్పాలని లేదంటే ఆరోపణలు నిరూపించాలని టిడిపి చెప్పింది. సభలో ఎవరో ఒకరే ఉండాలని టిడిపి కుండబద్దలు కొట్టింది. ఛాలెంజ్ను జగన్ స్వీకరిస్తున్నారా లేదా చెప్పాలని పత్తిపాటి కూడా రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.