జ్యోతుల చెప్తే వినలేదా: జగన్ పట్ల వైసిపిలో అసంతృప్తి ఉందా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన పార్టీలోనే కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. జగన్ పైన అసంతృప్తి కారణంగానే వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడితున్నారని టిడిపి చెబుతోన్న విషయం తెలిసిందే.
రాజకీయ రాజధాని అయిన విజయవాడలో వైసిపి సర్వసభ్య సమావేశం ఇటీవల జరిగింది. ఏపీలో వైసిపి కీలక భేటీ ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, టిడిపి పైన విమర్శలు, ఎమ్మెల్యేల వలసలతోనే జగన్ సరిపుచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ సర్వ సభ్య సమావేశంలో లోటుపాట్ల పైన చర్చించి ముందుకు సాగుదామని గతంలో వైసిపిలో ఉండి, ఇటీవల టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ అధినేత జగన్కు పలుమార్లు సూచించారని అంటున్నారు. అయితే, ఆయన మాటలను జగన్ పట్టించులేదంటున్నారు. ఆ తర్వాత జ్యోతుల పార్టీనీ వీడారు.
ఆ తర్వాతే సర్వ సభ్య సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి నాయకులు వచ్చారు. ఇదిలా ఉండగా, నాడు సమావేశంలో జరిగిన చర్చలు కొంతమంది సీనియర్ నేతల్లో అసంతృప్తిని మిగిల్చాయని అంటున్నారు.
సమావేశంలో జగన్ అంతా తానై మాట్లాడాటనే వాదనలు వినిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. అంతేకాదు, పట్టిసీమను వ్యతిరేకించడం వంటి అంశాల పైన వైసిపి నేతల్లోనే జగన్ పైన అసంతృప్తి ఉందని అంటున్నారు.
గతంలో రాజ్ భవన్ ఎదుట జగన్ మాట్లాడుతూ.. పదహారు మంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికి వైసిపి నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు.
ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో, జిల్లాల్లో కార్యకర్తల స్థైర్యం దెబ్బతిందని, గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించాలని చాలామంది భావించారు. జగన్ ముందు పలు సూచనలు చేయాలని పలువురు వచ్చారని, కానీ వారిలో చాలామందికి మాట్లాడే అవకాశం రాలేదంటున్నారు.
ఈ సమావేశంలో జగన్ దాదాపు నలభై నిమిషాలు మాట్లాడారని, అందులో ఎక్కువగా చంద్రబాబు విమర్శలకే సరిపోయిందని తెలుస్తోందని అంటున్నారు. కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వైసిపి డిమాండ్ చేయగా.. భూమా నాగిరెడ్డి వంటి వారు తెరపైకి వచ్చి ప్రతి సవాల్ విసిరి వైసిపిని చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే.