పోస్టుల భర్తీ ప్రక్రియను మారిస్తే మంచిది...ఇంటర్వ్యూలు ఉండాలి:ఎపిపిఎస్సీకి గవర్నర్ సూచన
హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియలో మార్పులు చేస్తే మంచిదని ఏపీపీఎస్సీకి గవర్నర్ నరసింహన్ సూచించారు. అలాగే అన్ని పోస్టులకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తే మెరుగైన అభ్యర్థులను నియమించుకునే అవకాశం ఉంటుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్, కార్యదర్శి ఎ.కె. మౌర్య, అదనపు కార్యదర్శి కళావతి, సభ్యులు రంగజనార్దన్, విజయకుమార్, సుజాత, పద్మరాజు, సేవా రూప కలిశారు. 2018 మార్చి 31వరకు చేపట్టిన కార్యక్రమాలతో కూడిన ఏపీపీఎస్సీ వార్షిక నివేదికను గవర్నర్ కు సమర్పించారు.

ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ఎపిపిఎస్సీ పాలకవర్గం ఇటీవల పోస్టుల భర్తీ ప్రక్రియను బాగా నిర్వహించిందని, పాత కేసులు పరిష్కరించుకొని, కొత్త కేసులతో ఇబ్బందులు రాకుండా చూసుకున్నారని వారిని ప్రశంసించారు. గతంలో వలె కాకుండా ఈసారి ఎపిపిఎస్సీలో అత్యున్నత అర్హతలు కలిగిన వ్యక్తులు ఉండటం వల్లే ఈ ప్రగతి సాధ్యపడిందని గవర్నర్ అన్నారు.
ఈ సారి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో చైర్మన్ సహా ఆరుగురు సభ్యులు ఉండగా వారిలో నలుగురు పీహెచ్డీలు ఉండటం చాలా మంచి పరిణామమని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఇదిలావుంటే ఇటీవల ఎపిపిఎస్సీ ఛైర్మన్ పిన్ననమనేని భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అందించే గ్రూప్-1, గ్రూప్- 2 సర్వీసులకు సంబంధించిన తుది సిలబస్ మరో నాలుగు రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ సర్వీసులకు సంబంధించి ముసాయిదా సిలబస్ ను నిపుణుల కమిటీకి పంపించామని, పరిశీలన పూర్తికావచ్చిందని పిన్ననమనేని భాస్కర్ తెలిపారు. అలాగే ఈ నెలాఖరు కల్లా రిక్రూట్మెంట్ కేలెండర్ను విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications