అమరావతి బాధ్యత మీది: చంద్రబాబుకు షాకిచ్చిన జపాన్ బృందం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు జపాన్ ప్రతినిధుల బృందం షాకిచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతోంది.
వెలగపూడిలో నిర్మిస్తున్నారు. దీనిని సందర్శించకుండానే జపాన్ బృందం వెళ్లిపోయిందని అంటున్నారు. బస్సులో నుంచే నిర్మాణాలను చూసిన ఆ బృందం వెనుదిరిగింది. జపాన్ బృందం తాత్కాలిక సచివాలయాన్ని సందర్శిస్తోందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే, జపాన్ బృందం సభ్యులు మాత్రం వెలగపూడిలో కనీసం బస్సు దిగలేదని, బస్సులో నుంచే దానిని చూశారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే వరకు కూడా వారు అక్కడ వేచి చూడకుండా వెళ్లిపోయారని అంటున్నారు. కాగా, ఆ తర్వాత అక్కడకు వచ్చిన చంద్రబాబు నిర్మాణ పనుల పైన సంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, అమరావతి నిర్మాణంలో జపాన్ ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలని, రాజధానిలో పరిపాలన భవనాలకు సంబంధించిన డిజైన్లను జపాన్కు చెందిన మకీ ఆర్కిటెక్ట్ సంస్థనే సిద్ధం చేసిందని, కేవలం ప్రణాళిక తయారు చేయడంలోనే కాదని, నిర్మాణం, అభివృద్ధిలోను మాతో పాటు మీకు సమష్టి బాధ్యత ఉందని చంద్రబాబు సోమవారం జపాన్ ప్రతినిధులతో వ్యాఖ్యానించారు.
జపాన్ సంస్థలు అమరావతిని రెండో ఇల్లుగా మార్చుకోవాలని, మరో టోక్యోగా అమరావతిని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. అమరావతి నుంచి నేరుగా టోక్యోకు విమాన సర్వీసులు భవిష్యత్తులో ఉంటాయన్నారు. అమరావతి బాధ్యత జపాన్ది కూడా అన్నారు. గేట్ వే హోటల్లో జపాన్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications