చంద్రబాబు సంజీవిని కాదన్నారు: విజయసాయి, వెంకయ్యనూ లాగారు
హైదరాబాద్: కాంగ్రెసు సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రతిపాదించిన ప్రత్యేక హోదా బిల్లు మనీ బిల్లు కాదని, దానిపై ఓటింగ్ జరగాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గురువారంనాడు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా సంజీవిని కాదని అన్నారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన జరిగిందనేది వాస్తవమని, అదే సమయంలో అవశేషాంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది కూడా వాస్తవమని ఆయన అన్నారు. ఒరిజినల్ బిల్లు మనీ బిల్లు కానప్పుడు కెవిపి ప్రతిపాదించిన సవరణ బిల్లు మనీ బిల్లు ఎలా అవుతుందని ఆయన అన్నాడు. మనీ బిల్లు అనడానికి వీల్లేదని న్యాయనిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలోని నిబంధనను ఉటంకించారు. రాజ్యాంగంలోని ఆర్టిల్ 4 ప్రకారం ఇన్సిడెంటల్ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించవచ్చునని ఆయన చెప్పారు రాజ్యాంగంలోని నిబంధనల మేరకు కూడా బిల్లుపై సుదీర్ఘ చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు లోకసభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందిందని, లోకసభలో అంతగా చర్చ జరగనప్పటికీ రాజ్యసభలో విస్తృతమైన చర్చనే జరిగిందని ఆయన అన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆరు అంశాలను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తావించారని, అందులో ప్రత్యేక హోదా ఉందని ఆయన చెప్పారు. ప్రధాని రాజ్యసభలో హామీ ఇచ్చిన తర్వాతనే బిల్లు ఆమోదం పొంది చట్టమైందని ఆయన గుర్తు చేశారు.
ప్రధాని, మంత్రులు రాజ్యసభలో చేసిన ప్రకటనలు చట్టంలో లేనప్పటికీ వాటిని అన్వయం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందువల్ల ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. పైగా, ప్రభుత్వం నిరంతరాయమైందని, వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిరంతర కొనసాగింపులో ఉనికిలో ఉన్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. అమలు చేయకపోతే సభా హక్కుల ఉల్లంఘన కూడా కావచ్చునని ఆయన అన్నారు.
ప్రధాని ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఇప్పటి మంత్రి వెంకయ్య నాయుడు అప్పుడు పదేళ్లు కావాలని పట్టుబట్టారని ఆయన గుర్తు చేశారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని టిడిపి, బిజెపిలు ఎన్నికల ప్రణాళిలో హామీ ఇచ్చాయని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ర్యాలీలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన అనేది జరిగిపోయిందని, ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని ఆయన అన్నారు. తమ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications