లేక.. లేక.. జనం మధ్య పుట్టినరోజు.. అదేరోజు ఆ టీడీపీ నేతకు భారీ షాక్!
మొత్తానికి ఓవైపు ఐటీ టెన్షన్.. మరోవైపు కార్యకర్తల ఒత్తిడితో.. గందరగోళం నడుమనే బద్రి నారాయణ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా టీడీపీలో ఆయనో పేరు మోసిన నాయకుడు. ఎమ్మెల్యే డీఏ సత్యప్రభకు స్వయానా మరిది. దీంతో సహజంగానే ఆయనకు అనుచర ఘనం కూడా ఎక్కువే. ఎలాగైనా ఆయన దృష్టిలో పడాలని చాలామంది టీడీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తుంటారు.
ఇంతకీ ఎవరాయన అంటే.. డీకే బద్రి నారాయణ. చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ అయిన దివంగత డీకే ఆదికేశవులు నాయుడుకి సొంత తమ్ముడు. అన్న బ్రతికున్న రోజుల్లో ఆయనకు సంబంధించిన చాలా వ్యవహారాలను బద్రి నారాయణే డీల్ చేసేవారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఆదికేశవులు మరణంతో ఆయన సతీమణి సత్యప్రభ రాజకీయాల్లోకి రాగా.. ఆమె విజయంలోను బద్రి నారాయణ కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంతో పాటు, జిల్లా రాజకీయాల్లోను ఆయనకు మంచి పట్టు ఉండటంతో.. చాలామంది జిల్లా నేతలు ఆయనకు టచ్ లో ఉండాలని ప్రయత్నిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే.. గత డిసెంబర్ 21న బద్రి నారాయణ పుట్టినరోజును ఘనంగా నిర్వహించి ఆయన మెప్పు పొందాలని స్థానిక నేతలు భావించారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే సరిగ్గా అదే రోజు తెల్లవారు జామున్నే అనుకోని అతిథుల్లా ఐటీ అధికారులు ఊడిపడ్డారు. దీంతో బద్రి నారాయణ ఒకింత అవాక్కయ్యారు.
పొద్దున్నే బొకేలతో నేతలెవరైనా ఇంటికొచ్చుంటారా.. అన్న ఆయన అభిప్రాయాలను తలకిందులను చేస్తూ.. ఐటీ అధికారులు ఆయనకు షాక్ ఇచ్చారు. దీంతో ఆయన పుట్టినరోజు వేడుకలు డైలామాలో పడ్డాయి. అంత కష్టపడి తాము ఏర్పాట్లు చేస్తే.. తీరా సమయానికి ఐటీ అధికారులు అంతా చెడగొట్టేశారన్న భావనలో కార్యకర్తలు ఉండిపోయారు.
ఓవైపు ఇంట్లో ఐటీ తనిఖీలు.. మరోవైపు బయట కార్యకర్తల హడావుడి.. ఇంట్లోకి.. బయటకు తిరుగుతూ బద్రి నారాయణ ఒకింత గందరగోళానికి గురయ్యారు. అయితే అభిమానులు, కార్యకర్తల ఒత్తిడితో.. ఓవైపు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండగానే.. మరోవైపు బద్రి నారాయణ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. టీడీపీ కార్యకర్తలు సాయంత్రం 6గం.కు ఆయన పుట్టినరోజు వేడుకలు ప్లాన్ చేశారు.
అనుకున్నట్టుగానే సాయంత్రానికి ఆయనతో కేక్ కట్ చేయించి ఘనంగా పుట్టినరోజు నిర్వహించారు. కాగా, ఎప్పుడూ తన పుట్టినరోజు వేడుకలను నిరాడబరంగా జరుపుకునే బద్రి నారాయణ.. లేక..లేక.. ఇక జనం మధ్యలో పుట్టిన రోజు వేడుకలు ప్లాన్ చేసుకుంటే.. ఐటీ అధికారుల ఎంట్రీతో అంతా తలకిందులు కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
రామ్మోహన్ రావుకు వియ్యంకుడు కావడం వల్లే:
తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావుపై ఐటీ దాడులు సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో.. ఆయనకు స్వయాన వియ్యంకుడు కావడం వల్లే బద్రి నారాయణపై ఐటీ దాడులు చేసినట్టు తెలుస్తోంది.
డిసెంబర్ 21న బద్రి నారాయణ ఇంట్లో మొదలైన ఐటీ సోదాలు ఆ మరుసటి రోజు మధ్యాహ్నాం మూడింటి దాకా జరిగాయి. దీంతో ఈ వార్త చిత్తూరు జిల్లా అంతటా కలకలం రేపింది. కాగా, తనిఖీల వివరాలను మాత్రం అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం.
మొత్తానికి ఓవైపు ఐటీ టెన్షన్.. మరోవైపు కార్యకర్తల ఒత్తిడితో.. గందరగోళం నడుమనే బద్రి నారాయణ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.