ఆ 2వేల కోట్లతో చంద్రబాబుకు లింకు? మాజీ పీఏ శ్రీనివాస్ డైరీనే పట్టించిందా? ఐటీ దాడుల ప్రకంపనలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ ఎట్టకేలకు గురువారం కీలక ప్రకటన చేసింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప సహా ఐదు చోట్ల జరిపిన దాడుల్లో బోగస్ కంపెనీల వ్యవహారం బయటపడిందని, సుమారు రూ.2వేల కోట్ల అక్రమ ఆస్తుల్ని గుర్తించామని చెప్పిన ఐటీ అధికారి సురభి అహ్లువాలియా మీడియాకు తెలిపారు. ఏపీలో అతి'ముఖ్య'మైన వ్యక్తి మాజీ పీఏ ఇంట్లో లభించిన ఆధారాలతోనే ఈ డొంక కదిలినట్లు ఐటీ శాఖ స్పష్టంగా పేర్కొనడం సంచలనంగా మారింది.

ఆయన చంద్రబాబు మాజీ పీఏ?
ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు.. గత ఐదు రోజులుగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు దగ్గర గతంలో పీఏగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస రావు ఇల్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లతోపాటు సేఫ్ గా దాచి ఉంచిన ఓ డైరీని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఆ డైరీ ఆధారంగా సోదాలు ముమ్మరం చేయగా, పెద్ద ఎత్తున అక్రమ వ్యవహారాలు బయటపడ్డాయి. అయితే గురువారం నాటి ప్రకటనలో ‘ఏపీకి చెందిన ముఖ్య వ్యక్తి మాజీ పీఏ'అని మాత్రమే పేర్కొన్న ఐటీ అధికారులు నేరుగా శ్రీనివాస్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. నేషనల్ మీడియా మాత్రం నేరుగా చంద్రబాబు, ఆయన మాజీ పీఏ శ్రీనివాస్ పేరుతోనే వార్తలు రాశాయి.

పక్కా సమాచారంతోనే?
ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు పక్కా సమాచారంతోనే చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై దాడులు చేశారని, కడప, విశాఖపట్నం, హైదరాబాద్లో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లతోపాటు తప్పుడు ఇన్డెంట్లు, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి జీఎస్టీ ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఐటీతోపాటు కేంద్ర ప్రభుత్వానికే చెందిన డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం కూడా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు కాంట్రాక్టుల కేటాయింపు వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారమంతా డైరీలో లభించినట్లు సమాచారం. దాడుల్లో రూ2.వేల కోట్ల అక్రమాస్తులను గుర్తించామన్న ఐటీ అధికారులు.. డీఎన్సీ ఇన్ఫ్రా, ఆర్ఆర్ ఇన్ఫ్రా, ఆర్కే ఇన్ఫ్రా కంపెనీల పేర్లు మాత్రమే వెల్లడించారు.

కేంద్రం ఆదేశాలతోనే..
చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ దాడులు మొదలైనప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. దీనిపై పలు మీడీయాల్లో రకరకాల కథనాలు వస్తున్నాయి. తాను సీఎంగా ఉన్నప్పుడు నాలుగేళ్లు ఎన్డీఏతో కలిసుండి, చివరి ఏడాదిలో బయటికొచ్చేసిన చంద్రబాబు.. తర్వాతి కాలంలో బీజేపీని దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారని, 2018లో మూడూ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపునకు ఆయనే ఫండింగ్ చేశారని, ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు చాలా సీరియస్ గా తీసుకున్నారని, దాని ఫలితంగానే ప్రస్తుతం కేంద్ర ఆదేశాలతో ఐటీ దాడులు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీన్ని ఏ పార్టీగానీ, ఏ నాయకుడుగానీ ధృవీకరించలేదు.

ఇక్కడ దాడులు.. సీఎం జగన్ ఢిల్లీకి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్న సమయంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, ప్రధాని మోదీతో దాదాపు రెండు గంటలపాటు సమావేశం కావడం.. ఆ వెంటనే చర్చలు సక్సెస్ అయ్యాయంటూ వైసీపీ నేతలు ప్రకటనలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. అటు పార్లమెంటులోనూ వైసీపీ ఎంపీలు.. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ అంశాన్ని పదే పదే లేవనెత్తుతుండటం తెలిసిందే. మొత్తంగా చంద్రబాబును ఇరుకున పెట్టేలా వైసీపీ, బీజేపీ కలిసి ఏదో చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.












Click it and Unblock the Notifications