రుణమాఫీపై రఘువీరా, జగన్ వెనుకడుగు: చిరంజీవి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజల సమస్యలను విస్మరించిందని, అధికార తెలుగుదేశం పార్టీ రుణమాఫీ భారం తప్పించుకోవడానికి షరతులు పెడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి శనివారం ఆరోపించారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అక్టోబర్ 2 నుండి ప్రారంభించనున్న జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, కార్యకర్తలు కార్యక్రమానికి వెళ్లి నిలదీయాలన్నారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లాసమీక్షా సమావేశానికి రఘువీరా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పదేళ్లపాటు తమను అధికారంలో నిలబెట్టిన గోదావరి జిల్లావాసుల రుణం తీర్చుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లల్లో పూర్తి చేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీని వెంటాడి ఈ ప్రాజెక్టును పూర్తి చేయిస్తామన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రావడానికి లేనిపోని వాగ్దానాలు చేసి తెలుగు ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ వడ్డించిన విస్తరిలా తయారుజేస్తే, బిజెపి, టిడిపిలు వంద రోజులకే కుక్కలు చింపిన విస్తరిలా తయారుచేశాయన్నారు. పింఛనుదారులు, రేషన్కార్డుదారులు, ఉపకార వేతనాలు పొందుతున్న విద్యార్థులు, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయం జరిగినా టిడిపి ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు.
రాజ్యసభ సభ్యులు చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఏదైనా చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంటే ఇక మళ్లీ ఆ చిత్రం ఉండదని సంతోషంగా సంబరాలు చేసుకుంటారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుందన్నారు. బాబు చిత్రం ఎంతోకాలం ఆడదన్నారు. కాపులు, బ్రాహ్మణులు, బిసిలను వాగ్దానాలతో మభ్యపెట్టి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. టీడీపీ హత్యా రాజకీయాలు చేస్తోందని చర్చకు లేవనెత్తిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరకు పాలకపక్షం ఎదురు ప్రశ్నలతో దాడి చేసేసరికి వెనుకడుగు వేసిందన్నారు. రుణమాఫీ భారం తప్పించుకోవడానికి చంద్రబాబు అనేక నిబంధనలు విధిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications