ఆర్టీసీ ఆస్తులు ప్రభుత్వ పరిధిలోకి..!! లీజు ప్రాతిపదికన ఒప్పందాలు : కమిటీ సిఫార్సులు..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ (పీటీడీ) ఉద్యోగులుగా మారారు. వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. అయితే, ఇప్పటి వరకు ప్రత్యేక సంస్థగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ఇకపై ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవటానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం నుంచి వేగంగా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ రోజువారీ రాబడిలో కొంత ఇవ్వాలని ఆర్టీసీని, ప్రభుత్వం కొంత కాలంగా కోరుతోంది.

కమిటీ సిఫార్సుల మేరకు
పీటీడీ ఉద్యోగులైన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందరినీ ఆర్టీసీ వినియోగించుకుంటోంది. దీనిని సేవల కింద పరిగణించి ఎక్కువ మొత్తం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. వీటన్నింటిపై అధ్యయనం చేసేందుకు కొద్ది రోజుల కిందట ఆర్థిక నిపుణులు, అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ ఇటీవల అందజేసిన నివేదికలో.. ఆర్టీసీని ప్రభుత్వం లీజుకు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆర్టీసీకి సంబంధించిన పలు ఆస్తులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఒప్పందం చేసుకొని ఆర్టీసీ కార్యకలాపాలు అన్నీ పీటీడీ ద్వారా నిర్వహించనున్నారు.

నిర్వహణా ఆదాయం పోగా
బస్సుల్లో టికెట్ల విక్రయాలు కూడా పీటీడీ తరఫునే జరుగుతాయి. రోజువారీ రాబడి ప్రభుత్వ పరిధిలోకి వెళ్తుంది. ఆర్టీసీ రోజువారీ రాబడి లక్ష్యం రూ.15 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.12-13 కోట్ల వరకు వస్తోంది. ఇందులో ఆర్టీసీకి డీజిల్ వ్యయం, నిర్వహణ ఖర్చులకు 60-70 శాతం వరకు సంస్థకు ఇచ్చే అవకాశం ఉంది. అది పోగా మిగిలిన ఆదాయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో బ్యాంకు రుణాలకు వాయిదాలు, వడ్డీ కలిపి ఆర్టీసీ నెల నెలా చెల్లించాల్సిన రూ.కోట్ల మొత్తాన్ని ఇప్పుడు ఎవరు చెల్లిస్తారనేది సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే ఆర్టీసీకి చెందిన పలు స్థలాలను లీజుకిచ్చారు.

లీజు ప్రాతిపదికన ముందుకు
మరికొన్ని బస్టాండ్లు, డిపోల పరిధిలో ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీసీకి ప్రస్తుతం 9,104 సొంత బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 423 బస్టాండ్లు, 129 డిపోలు, గ్యారేజీలు, 4 జోనల్ వర్క్షాపులు, 20 డిస్పెన్సరీలు, ఆసుపత్రులు తదితర ఆస్తులున్నాయి. వీటన్నింటిని మూడేళ్లకు లీజుకు తీసుకునేలా ప్రభుత్వం.. ఆర్టీసీతో ఒప్పందం చేసుకోనుంది. నిర్వహణ ఖర్చులు పోను ఏ మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందనే అంశం పైన అధ్యయనం సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

పన్నుల భారం లేకుండా చేసేందుకే అంటూ
సంస్థకు చెందిన ఆస్తులను లీజుకు ఇవ్వటం ద్వారా వచ్చే మొత్తాన్ని బ్యాంకు వాయిదాలు చెల్లించేందుకు వినియోగించేలా ప్రతిపాదించినట్లు సమాచారం. లీజు ప్రక్రియ ప్రతిపాదనను వివిధ శాఖలు పరిశీలించాయి. మున్ముందు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా చూసేందుకు చివరిగా న్యాయశాఖ వద్దకు పంపారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెబుతున్నారు. దీని పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు మాత్రం కేవలం కొన్ని రకాల పన్నుల భారం లేకుండా చూసేందుకే ఈ లీజు ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన మరింత స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications