రాసలీలల ఆడియో టేపు... ఖండించిన మంత్రి అవంతి... రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే...
మంత్రి అవంతి శ్రీనివాస్ పేరిట సోషల్ మీడియాలో ఓ రాసలీలల ఆడియో టేపు చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన మంత్రి అవంతి శ్రీనివాస్... తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేకనే కొంతమంది ఇలా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అన్నారు. తాను స్వయంకృషితో ఎదిగొచ్చిన వ్యక్తినని... తనను బద్నాం చేసేందుకే ఇలాంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు,దేవుడి దీవెనలు ఉన్నంతకాలం ఇలాంటి కుట్రలు ఫలించవన్నారు.
వైసీపీకి మహిళల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేక కూడా ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యర్థి సైతం బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తనది అన్నారు. తాను ఎవరిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగలేదని పేర్కొన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో గానీ రాజకీయ ఎదుగుదలను ఆపలేరని అన్నారు. పది మందికి మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడని నమ్మే వ్యక్తిని తానని చెప్పారు.
ఇటీవలి కాలంలో తాను కొంత ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం కొంతమందికి నచ్చకపోయి ఉండవచ్చునన్నారు. అది కూడా దీనికి కారణమై ఉండవచ్చునని అన్నారు. ఇలా ఎవరికి ప్రయోజనం లేని పనుల ద్వారా సాధించేది ఏమీ ఉండదని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని... సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. సొంత పార్టీ నేతలే ఇలా చేసి ఉంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తనకెవరితోనూ ఎలాంటి విబేధాలు,వివాదాలు లేవన్నారు. ఎవరు చేశారనేది పోలీసులు తేలుస్తారని చెప్పారు.
Recommended Video
ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరిట కూడా ఇలాగే ఓ రాసలీల ఆడియో టేపు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన అంబటి రాంబాబు... కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అందులో ఉన్న గొంతు తనది కాదన్నారు. కేవలం తన పరువు,ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ పదేళ్ల క్రితం ఓ ప్రముఖ టీవీ ఛానెల్ ఇలాగే దుష్ప్రచారం చేసిందని... దాన్ని న్యాయస్థానంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నానని తెలిపారు. కోర్టు కూడా ఆ ఆరోపణలను తప్పుడు ఆరోపణలుగా నిర్దారించిందని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని... సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు,వైసీపీ కార్యకర్తలు దీన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఆడియో టేపు బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టబోతున్నట్లు చెప్పారు.