జరిగేది కురుక్షేత్ర యుద్దం - నా ధైర్యం ఒక్కటే : చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు..!!
ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. తాజాగా జాతీయ టీవీ చర్చలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించారు. నరమాంసం తినే పులి మారిందంటే నమ్ముతామా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై సెటైర్లు వేసారు. జగనన్న వసతి దీవెననిధులను విడుదల చేసిన సీఎం జగన్..రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. జరిగేది కురుక్షేత్ర యుద్దంగా పేర్కొన్నారు. తన ధైర్యం.. నమ్మకం..ఆత్మవిశ్వాసం ఏంటో స్పష్టం చేసారు. నమ్మితే అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.
చంద్రబాబు పై వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ తాజాగా చంద్రబాబు వ్యాఖ్యల పైన స్పందించారు. పంచతంత్ర కధను వివరిస్తూ చంద్రబాబు తీరును ప్రస్తావించారు. మాంసం తినే పులి మారిందంటే నమ్ముతామా అని ప్రశ్నించారు. ముసలాయన వచ్చీ రాని భాషలో మాట్లాడారని ఎద్దేవా చేసారు. రానున్న రోజుల్లో ఇంకా అబద్దాలు చెప్పి మోసాలు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పుకొచ్చారు.

గతంలో జాబు రావాలంటే బాబు రావాలి వంటి నినాదాలతో అధికారంలోకి వచ్చి ఏం చేసారో వివరించారు. బాబు వచ్చాడు..రైతును ముంచాడు అంటూ ఎద్దేవా చేసారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎన్నికలకు మూడు నెలల ముందు మూడు లక్షల మంది రూ వెయ్యి చొప్పున ఇచ్చారని గుర్తు చేసారు. పెన్షన్ల విషయంలోనూ మోసం చేసారని విమర్శించారు. ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ముఖ్యమంత్రి కోరారు.
కురుక్షేత్ర యుద్దం..ధైర్యం ఒక్కటే
అదే రాష్ట్రం..అదే బడ్జెట్ అని వివరించిన సీఎం..మారింది కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని చెప్పారు. 2014-19 మధ్య జరగని మంచి ఇప్పుడు అందుతోందన్నారు. ఇప్పటి వరకు 2.09 లక్షల కోట్ల మేర నేరుగా లబ్దిదారులకు అందించి..ప్రతీ కుటుంబానికి మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు అండ్ టీం దోచుకో, పంచుకో, తినుకో అనే విధంగా వ్యవహరించిందన్నారు.

ఇప్పుడు అందిస్తున్న విధంగా అప్పుడు ఎందుకు ఇవ్వలేదని నిలదీసారు. లంచాలు లేవు, వివక్ష లేదు. నేరుగా ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి మంచి చేస్తున్నారని వివరించారు. ఈ అబద్దాలు మోసాలను నమ్మకండని సీఎం సూచించారు. మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలని కోరారు. మంచి జరిగితే మీరే సైనికులు అవ్వండని పిలుపునిచ్చారు. వచ్చే కురుక్షేత్ర యుద్దంలో మీ మద్దతు జగన్ కు ఉండాలని అభ్యర్ధించారు. తన నమ్మకం..ధైర్మం..ఆత్మవిశ్వాసం మీరే నంటూ సభకు హాజరైన వారికి ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు.
ఎంత ఖర్చు అయినా చదవిస్తాం
నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి జగనన్న వసతి దీవెన నగదును సీఎం జగన్ విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేసారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసామని చెప్పారు. భవిష్యత్ కు అవసరమయ్యే విధంగా బోధనలోనూ మార్పులు చేసామన్నారు.
ప్రతీ విద్యార్ధికి ట్యాబ్ అందించటం ద్వారా ఇప్పుడు ప్రయివేటు విద్యా సంస్థలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎంత ఖర్చు అయినా అందరినీ చదివించే బాధ్యత తాను తీసుకుంటానని జగన్ చెప్పారు. ప్రతీ విద్యార్ధి నచ్చిన రంగంలో లీడర్ గా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications