దుర్గ గుడి ఈవో పోస్టు అస్మదీయులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం నాటకం:ఐవైఆర్ కృష్ణారావు
అమరావతి:గత కొన్నిరోజులుగా విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు...వాటిపై ప్రభుత్వం స్పందించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు.
అధికారులను అవసరానికి వినియోగించుకొని...వారి అవసరం తీరాక వారిని కించపరచడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వసాధారణమైపోయిందని ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి చీరను దొంగలించింది పాలకమండలి సభ్యురాలైతే ఈవోపై వేటు వేయడమేమిటని ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు.

ఆర్థికంగా చాలా లాభదాయకమైన దుర్గ గుడి ఈవో పోస్టు కావాలని కోరుకునే అధికారులు అనేకమంది ఉంటారని...ఆ పదవిని తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం నాటకం ఆడినట్లు కనిపిస్తోందని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. మొత్తం వ్యవహారం చూస్తుంటే తనకు అదే అనుమానంగా ఉందన్నారు. దుర్గ గుడిలో ఇటీవల పరిణామాలన్నీ గమనిస్తుంటే అధికారులతో హుందాగా వ్యవహరించడం ఏపీ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందని ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు.
విజయవాడ దుర్గ గుడిలో ఓ భక్తురాలు అమ్మవారికి సారెగా సమర్పించిన 18 వేల రూపాయల ఖరీదైన చీర కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో విచారణ జరిపి తొలుత పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యకుమారిపై వేటు వేసిన ప్రభుత్వం ఆ తరువాత ఆలయ ఈవో ఎం. పద్మపై బదిలీ వేటు వేశారు.
పద్మను బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా దేవాదాయశాఖ ఇన్చార్జ్ కమిషనర్గా కూడా పద్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బదిలీ అయిన పద్మస్థానంలో దుర్గగుడి ఈవోగా ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మను నియమించారు. ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ రాష్ట్రానికి డిప్యూటేషన్పై రాగా...ఈమె గతంలోనే దుర్గ గుడి ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారనే వార్తలు వచ్చాయి. అవి అప్పుడు వాస్తవరూపం దాల్చకపోయినా ఇప్పుడు సాధ్యపడింది.












Click it and Unblock the Notifications