అంతర్జాతీయ రాజధాని కాన్సెప్ట్ తప్పు: ఐవైఆర్, 'ఎవరి రాజధాని'ని ఆవిష్కరించనున్న పవన్
అమరావతి: అంతర్జాతీయ రాజధాని అనే కాన్సెప్ట్ తప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. ఎవరి రాజధాని అమరావతి పేరుతో ఓ పుస్తకాన్ని రాశానని, దాన్ని ఏప్రిల్ 5వ తేదిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారని కృష్ణారావు ప్రకటించారు.
ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో తనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవని ఆయన గుర్తు చేశారు.
దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాల్లో ఛండీగఢ్, భువనేశ్వర్, రాయ్పూర్, రాంచీ లాంటి రాజధానులను ఏ ప్రాతిపదికన కట్టారు, అసలు ప్రపంచ వ్యాప్తంగా రాజధానుల నిర్మాణాల అనుభవాలేంటి? తదితర అంశాలను కూలంకుశంగా పరిశీలించి ఒక పుస్తకం రాశానని ఐవైఆర్ చెప్పారు.

అంతర్జాతీయ రాజధాని తప్పు
ఏపీ రాష్ట్రానికి అంతర్జాతీయ రాజధాని అనేది తప్పని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. రాజధాని నిర్మాణంలో అసలు పురోగతి లేనే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల నిధులను ఖర్చు చేస్తే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 5 లక్షల కోట్ల జిడిపి ఉన్న రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం ఇన్ని నిధులు ఖర్చు చేయడం అవసరం లేదన్నారు.

టిడిపి నేతలను పిలిచా
ఎవరి రాజధాని అమరావతి పేరుతో తాను రాసిన పుస్తకాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 5వ తేదిన విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్లో ఆవిష్కరిస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వనించినట్టు ఆయన చెప్పారు. టిడిపి నేతలకు కూడ ఆహ్వనం పంపానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

కేంద్రం నుండి నిధులు
కేంద్ర ప్రభుత్వం నుండి రీజనబుల్గానే ఏపీ రాష్ట్రానికి నిధులు వచ్చాయిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఇంకా కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రావడానికి సమయం ఉందన్నారు. ఏపీ రాష్ట్రానికి అసలు నిధులు రానే రాలేదనే విషయాన్ని ఆయన కొట్టిపారేశారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావుకు బుక్ అంకితం
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు ఎవరి రాజధాని అమరావతి పుస్తకాన్ని అంకితం ఇవ్వనున్నట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు. ఈ విషయాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావుకు చెప్పి ఆయన అనుమతి కూడ తీసుకొన్నట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫారసులు, స్విస్ ఛాలెంజ్ తదితర విషయాలను ప్రస్తావించానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications