'ఉద్యోగుల్ని తీసుకురావాలి, ఏపీలో తెలంగాణ వారి దీనావస్థ'
హైదరాబాద్: ఏపీకి కేటాయించిన తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు అందరినీ తెలంగాణకు తిరిగి తేవాల్సిందేనని తెలంగాణ ఉద్యోగ జేఏసీ శనివారం నాడు తీర్మానం చేసింది. ఐచ్చికానికి భిన్నంగా ఏపీకి వెళ్లాల్సి వచ్చినందుకు ఆఖరి శ్రేణి ఉద్యోగి మొదలు ఉన్నత శ్రేణి అధికారి వరకు అందరినీ అందుబాటులో గల ఖాళీల్లోకి తేవాలని సోమవారం రాష్ట్ర ప్రదాన కార్యదర్శికి విజ్ఞప్తి చేస్తామని జేఏసీ చెప్పింది.
తెలంగాణలో హెచ్ఓడీలలోను, జిల్లాల్లోను చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఇక్కడ అవసరం చాలానే ఉందని చెప్పారు. తెలంగాణకు నియమితులైన ఏపీ ఉద్యోగులు తిరిగి ఏపీకి వెళ్లడానికి సిద్ధపడితే ఇక్కడ వారిని రిలీవ్ చేస్తారన్నారు.

ఏపీ ప్రభుత్వంలో తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగులు భరింపరాని అవమానాలకు గురవుతున్నారని జేఏసీ నేతలు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజైషన్కు కేటాయించిన 13 మంది తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులతో ఏపీ అధికారులు కఠినమైన పనులు చేయించుకుంటున్నారన్నారు.
అవసరమయితే మార్గదర్శకాలలో మార్పులు చేసి, ఉద్యోగుల విభజన అడ్వయిజరీ కమిటీ ఇదివరలో హామీ ఇచ్చిన ప్రకారం ఏపీకి కేటాయించిన తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులందరినీ వెంటనే తెలంగాణకు కేటాయించాలన్నారు. అవసరమయితే మార్గదర్శకాలలో మార్పులు చేసి ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులందరినీ తెలంగాణకు తీసుకరావాలని, ఈ విషయంలో ప్రధాన కార్యదర్శి చొరవ చూపాలన్నారు.












Click it and Unblock the Notifications