'టి బిల్లు పాస్: జగన్ సంబరాలు, సమాచారం':చిరు పైనా
హైదరాబాద్: సమైక్య ముసుగులో ఐదున్నర కోట్ల మంది సీమాంధ్ర ప్రజలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేసారని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అవగానే జగన్ తన ఇంట్లో ఉత్సవాలు చేసుకున్నారని, దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని గాలి ఆరోపించారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో గురువారం ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ, కాంగ్రెసు పార్టీకి జగన్ అన్ని విధాలుగా సహకరిస్తూ, కురుక్షేత్ర యుద్దంలో శకుని పాత్ర పోషిస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ జగన్కు బెయిల్ ఇచ్చి నాటకాలు ఆడుతుందని ధ్వజమెత్తారు. లోక్సభలో, రాజ్యసభలో కాంగ్రెసు పార్టీ వ్యవహరించిన తీరు చూస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా ఖూనీ చేసారో అర్థం అవుతుందని విమర్శించారు.
ఓట్ల కోసం, సీట్ల కోసం 60 ఏళ్లుగా నానుతున్న తెలంగాణ సమస్యకు ఏకపక్షంగా బిల్లు ఆమోదించుకొని కాంగ్రెసు పార్టీ రాజ్యాంగాన్ని, సంప్రదాయాలను దారుణంగా ఉల్లంఘించిందని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తమ పార్టీ సభ్యుడు సుజనా చౌదరీ, బిజెపి సభ్యుడు అరుణ్ జైట్లీ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని గాలి ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చంద్రబాబును చిరంజీవి విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అహ్మద్ పటేల్ రాసి ఇచ్చిన స్కిృప్ట్ను చిరంజీవి చదివారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు వల్లనే సాధ్యమని అన్ని ప్రాంతాల ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఆయన విమర్శించారు.
చిరు పైన ఇతర నేతలు..
సీమాంధ్ర ప్రాంతానికి మొదటి ద్రోహి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవేనని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యురాలు సీతారామలక్ష్మి, సీనియర్ నేతలు కళా వెంకట్రావు గురువారం ఆరోపించారు. సీమాంధ్ర ద్రోహుల్లో మొదటి స్థానం చిరుకే దక్కుతుందన్నారు. సీమాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడే నైతకి హక్కు ఆయనకు లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, ఈ రాజకీయ చదరంగంలో సీమాంధ్రులు బలయ్యారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు శ్రీధర్, ఆనంద బాబు, జివి ఆంజనేయులు పేర్కొన్నారు. విభజనకు నిరసనగా పెదకూరపాడు, వేమూరు, వినుకొండ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి, ఆనందబాబు, ఆంజనేయులు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు లేఖలు పంపామని తెలిపారు.
కొమ్మాలపాటి మాట్లాడుతూ పార్లమెంటులో ఎంపిలపై దాడులు చేయడం, ప్రసారాలు నిలిపివేసి గందరగోళం సృష్టించి రాష్ట్ర విభజన చేయడం అప్రజాస్వామికమన్నారు. వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ పార్లమెంటులో కాంగ్రెస్, బిజెపిలు ఏకమై తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్ర విభజనకు పూనుకున్నారన్నారు. జివి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసిన యుపిఎ ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరును నిరసిస్తూ పలువురు టిడిపి ఎమ్మెల్యేలు తమ పదవులకు గుడ్బై చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే మీనాక్షినాయుడు గురువారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కృష్ణా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు గురువారం తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా శాసనసభ స్పీకర్ మనోహర్కు పంపారు.
విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గురువారం అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖ అందజేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే హేమలత తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా అసెంబ్లీ స్పీకర్ మనోహర్కు పంపించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్ (పెదకూరపాడు), నక్కా ఆనందబాబు(వేమూరు), జీవీఎస్ఆర్ ఆంజనేయులు (వినుకొండ) తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు.