ఎంపిగా నా బాధ్యత: షరతు సడలించాలని కోర్టుకు జగన్
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన బాధ్యత తన పైన ఉందని, అందుకే తనకు బెయిల్ షరతులని సడలించాలని కోరుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతును సడలించాలని ఆయన పిటిషన్లో కోరారు. న్యూఢిల్లీకి వెళ్లేందుకు, ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు తనకు అనుమతివ్వాలని కోరారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల మనోభావాలను, వారి కష్టనష్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు.

తాను ఓదార్పు యాత్రను కూడా కొనసాగించాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను కలిసి వారి మనోభావాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంపిగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన పైన ఉందన్నారు. ఎంపీగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
కాగా, దాదాపు ఇరవై రోజుల క్రితం వైయస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో హైదరాబాదు విడిచి వెళ్లరాదనే షరతు కూడా ఉంది. దీంతో ఆయన దానిని సడలించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications