జగన్ తొలిదెబ్బ బాలయ్యకే-అఖండ థియేటర్ల సీజ్ లు- షోల నిలిపివేతలతో రచ్చ
ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త సినిమాటోగ్రఫీ చట్టం తొలిదెబ్బ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండకు తగిలింది. ఇవాళ అఖండ చిత్రం ఏపీ వ్యాప్తంగా విడుదల కాగా.. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లు ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు పలు చోట్ల సీజ్ చేశారు. అదనపు షోలు నిలిపేశారు. దీంతో నిరాశకు గురైన బాలయ్య అభిమానులు పలు చోట్ల నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Recommended Video
అఖండకు జగన్ సర్కార్ షాక్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల విడుదలైంది. ఏపీలోనూ ఈ చిత్రం పలు థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఎప్పటిలాగే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు అదనపు షోలతో పాటు సాధారణ తరహాలోనే టికెట్లు విక్రయించారు. దీంతో ప్రభుత్వం వారికి షాకిచ్చింది. తాజాగా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని వారిపై ప్రయోగించింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
అఖండ థియేటర్లలో తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అఖండ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కృష్ణాజిల్లాలో ఆఖండ సినిమా ప్రదర్శిస్తున్న దియేటర్స్ ను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా బెనిపిట్ షోలు ప్రదర్శించిన ధియేటర్ లను సీజ్ చేస్తున్నారు మైలవరం లోని సంఘమిత్ర దియేటర్ ను అధికారులు సీజ్ చేశారు హనుమాన్ జంక్షన్ కే యస్ టాకిస్ ధియేటర్ రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. బాపులపాడు అర్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిక్కెట్లు ధరలు , కోవీడ్ నిబంధనలు ఏలా పాటిస్తున్నారు , బ్లాక్ టిక్కెట్లు అమ్ముతున్నారని పరిశీలించారు. తమ అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం మొదటి ప్రదర్శన చూడాలనే ఉత్సాహం తో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోవీడ్ లాక్ డౌన్ అనంతరం ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.
అఖండ థియేటర్ల సీజ్
గుంటూరు జిల్లా ఉండవల్లి లో నిబంధనలు పాటించని ఓ సినిమా థియేటర్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉండవల్లి సెంటరు లోనీ శ్రీ రామకృష్ణ సినిమా హాల్ లో విడుదలైన అఖండ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించారనే అభియోగంతో అధికారులు సినిమా హాల్ ను సీజ్ చేశారు. హాల్ నిర్వాహకులు వారు అనుమతి పొందిన సమయం కంటే ముందుగానే సినిమా ను ప్రదర్శించినా స్థానిక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని వార్తలు రావడంతో స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి తనిఖీలు చేసి సీజ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు మండల తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, పోలీసు బందోబస్తు మధ్య సినిమా హల్ సీజ్ చేశారు. తదుపరి ఆదేశాల వరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఇప్పటికే బుకింగ్, ఆన్లైన్ లో టికెట్ లు కొనుగోలు చేసిన వారికి నగదు వాపసు ఇవ్వనున్నట్లు ధియేటర్ నిర్వాహకులు తెలిపారు. ఇదే కోవలో పలు చోట్ల ధియేటర్లు సీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం పలు చోట్ల ధియేటర్లలో అధికారులు తనిఖీలు చేపట్టడం, నిబంధనల ఉల్లంఘన పేరుతో ధియేటర్లు సీజ్ చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆక్షేపించారు. అధికారుల తనిఖీల సందర్బంగా పలు చోట్ల బాలయ్య అభిమానులు బహిరంగంగానే నిరసన తెలిపారు. థియేటర్ల సీజ్ ద్వారా బాలయ్య అఖండ ను అడ్డుకోలేరని వారు చెప్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అఖండ చిత్రం తొలిరోజే ఘన విజయం సాధించిందన్నారు.