కాకాణి ఫైల్స్ మిస్సింగ్-సీబీఐ దర్యాప్తుకు జగన్ సర్కార్ ఓకే-హైకోర్టు సుమోటో విచారణతో
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ కేసు ఫైల్స్ చోరీ ఘటనపై హైకోర్టు సుమోటో విచారణ కీలక పరిణామానికి దారి తీసింది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నకిలీ ఆరోపణలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అందుకు కారణమైన ఫోర్జరీ ఫైల్స్ దొంగతనంతో మరోసారి ప్రత్యర్ధులకు టార్గెట్ గా మారారు. దీంతో హైకోర్టు సుమోటో విచారణలో ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు అంగీకరించింది.

కాకాణి ఫైల్స్ మిస్సింగ్
గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అప్పట్లో సర్వేపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ నకిలీ పత్రాలు మీడియా ముందు ప్రదర్శించారు.
ఆ తర్వాత వీటిపై స్పందించిన సోమిరెడ్డి పరువు నష్టం దావా వేశారు. దీంతో ఈ నకిలీ పత్రాల వ్యవహారం కాకాణి మెడకు చుట్టుకుంది. ఈ కేసు కోర్టులో ఉండగానే ఆ ఫోర్జరీ పత్రాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఈ కేసు మరింత తీవ్రంగా మారిపోయింది.

కాకాణి పాత్రపై అనుమానాలు?
గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సృష్టించారని చెబుతున్న నకిలీ పత్రాల ఆధారంగా సోమిరెడ్డి నెల్లూరు కోర్టులో కేసు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పత్రాల చోరీ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.అదీ కాకాణి తాజాగా మంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటనతో ప్రభుత్వం సైతం ఇరుకునపడింది. అంతకు మించి ఈ పత్రాల మిస్సింగ్ లో మంత్రి కాకాణి పాత్ర ఉండొచ్చంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలూ కీలకంగా మారిపోయాయి. దీంతో ఫోర్జరీ పత్రాల మిస్సింగ్ వ్యవహారం కూడా కాకాణి మెడకు చుట్టుకుంటోంది.

హైకోర్టు సుమోటో విచారణ
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడుగా ఉన్న కేసులో సాక్ష్యాలుగా ఉన్న ఫోర్జరీ పత్రాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీ అయిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. సుమోటోగా ఈ కేసును విచారణకు చేపట్టింది. ఇంత కీలకమైన కేసులో పత్రాల చోరీపై అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇవాళ విచారణలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. దీంతో సమాధానం చెప్పలేక ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం సైతం ఇరుకునపడ్డారు. మొత్తం మీద ఈ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించరాదో చెప్పాలంటూ హైకోర్టు వేసిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

సీబీఐ దర్యాప్తుకు జగన్ సర్కార్ ఓకే
నెల్లూరు కోర్టులో చోరీ సంఘటన పై హైకోర్టు సుమోటో విచారణలో న్యాయమూర్తి ఈ కేసును సీబిఐ కి ఎందుకు అప్పగించకూడదంటూ ఏజీని ప్రశ్నించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై తమకు అభ్యంతరం లేదని ఏజీ సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు.. సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాణికి నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. చోరీ సంఘటనపై హైకోర్టు సుమోటో విచారణ వచ్చే నెల 6కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications