ఏపీ ఎస్ఈసీ కార్యదర్శిగా ఐఏఎస్ కన్నబాబు- జగన్ సర్కారు ఉత్తర్వులు
పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న జగన్ సర్కారు ఇవాళ కమిషన్కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘంలో ఐఏఎస్ వాణీ మోహన్ ఉద్వాసన తర్వాత ఖాళీ అయిన కార్యదర్శి పోస్టులో ఐఏఎస్ కన్నబాబును నియమిస్తూ జగన్ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ఎన్నికల సంఘంలో ఉంటూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ గతంలో ఐఏఎస్ వాణీ మోహన్పై వేటు వేశారు. తన వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్న వాణీ మోహన్ను కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి తీవ్ర సిబ్బంది కొరత ఉంది. తాజాగా కమిషన్లో ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ ఎన్.సంజయ్ను నిమ్మగడ్డ నియమించారు. ఆ తర్వాత కార్యదర్శిగా ప్రభుత్వంలో ఏ పోస్టింగ్ లేని ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రను నియమించారు. అయితే వెంటనే ప్రభుత్వం ఆయన్ను వైద్యారోగ్యశాఖలో కొత్త పోస్టు సృష్టించి మరీ అందులో నియమించింది.

ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘానికి ముగ్గురు ఐఏఎస్లతో కూడిన జాబితాను జగన్ సర్కార్ పంపింది. ఇందులో ఐఏఎస్ అధికారులు కన్నబాబు, రాజబాబు, విజయ్ కుమార్ ఉన్నారు. ఇందులో కన్నబాబువైపు ఎస్ఈసీ మొగ్గుచూపడంతో ఆయన్ను కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇకపై నిమ్మగడ్డతో పాటు కమిషన్లో డిప్యూటీగా కన్నబాబు ఆయనకు సహకరించబోతున్నారు. ప్రస్తుతం కన్నబాబు ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం కమిషనర్గా ఉన్నారు.












Click it and Unblock the Notifications