జగన్ సర్కార్ కు కోతల వెనుక ? అసలు కథ బయటపెట్టిన కేంద్రం-విపక్షాలకు ఊతం
ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై నానాటికీ అనుమానాలు పెరిగిపోతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిపై కొంతమేర క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు కేంద్రం అనుమతించిన పరిధిలోనే ఉన్నాయా లేదా అనే దానిపై నిన్న రాజ్యసభలో చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఇందులో ఏపీ ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల మేర కేంద్రం పరిమితిని మించి రుణాలు తీసుకున్నట్లు దీంతో వెల్లడైంది. విపక్షాలకు ఇదో కొత్త ఆయుధంగా మారింది.
జగన్ సర్కార్ అప్పుల తిప్పలు
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా అప్పులపైనే ఆధారపడుతోంది. లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఖజానా ఖాళీ కావడంతో ప్రతీ నెలా ఎక్కడో చోట అప్పులు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. దీంతో అప్పుల చిట్టా పెరిగిపోవడంతో పాటు రాష్ట్ర ప్రజలపై అదనపు భారం కూడా పడుతోంది. అయినా ఉద్యోగులకు జీతభత్యాలు, పింఛన్లు చెల్లించడానికి ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆర్దిక పరిస్ధితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం పరిమితి దాటేసిన అప్పులు
కేంద్ర ప్రభుత్వం ప్రతీ రాష్ట్రానికి వాటి ఆదాయంలో 3 శాతం మేర రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తుంది. దీన్నే ఎఫ్ఆర్బీఎం పరిమితిగా నిర్ణయిస్తుంది. దీన్ని మించి రుణాలు తీసుకోవాలంటే కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో అనుమతిస్తుంది. అలా గతేడాది కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు అమలు చేస్తే మరో 2 శాతం రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో సదరు సంస్కరణలు అమలు చేసిన వైసీపీ సర్కార్.. ఆ రెండు శాతం అదనపు పరిమితి రుణాలను కూడా తెచ్చుకుంది. అంతటితో ఆగకుండా పరిమితిని మించిపోయి రుణాలు తెచ్చేసుకుంది.
రాజ్యసభలో బయటపెట్టిన కేంద్రం
గత ఆర్దిక సంవత్సరంలో అంటే 2020-21లో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతించిన రుణ పరిమితి ఐదు శాతం ప్రకారం మొత్తం రూ. 49,4978 కోట్ల మేర రుణాలు తీసుకునే అవకాశముంది. కానీ ఏపీ ప్రభుత్వం ఈ పరిమితిని దాటేసి మరీ రుణాలు తెచ్చుకున్నట్లు కేంద్రం నిన్న రాజ్యసభలో ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదుశాతం పరిమితి ప్రకారం రూ.49,497 కోట్ల రుణాలు తీసుకోవాల్సి ఉండగా.. వైసీపీ సర్కార్ మాత్రం రూ.54,369 కోట్ల రుణాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఈ లెక్కన దాదాపు రూ.5 వేల కోట్ల మేర అదనపు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ సర్కార్ అప్పులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనన్న చర్చ మొదలైంది. కేంద్రం చేసిన ప్రకటన విపక్షాల విమర్శలకు ఊతమిచ్చేలా ఉంది.
ఈ ఏడాది కోతలకు కారణమిదేనా ?
గత ఆర్ధిక సంవత్సరంలో పరిమితికి మించిన రుణాలు తీసుకున్న వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంది. ఈ ఏడాది తీసుకునే రుణాల్లో ఇప్పటికే పలు కోతలు విధించిన కేంద్రం.. గతేడాది అదనపు రుణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో రాబోయే ఆర్ధిక సంవత్సరంలో తీసుకునే రుణాలపైనా ఈ ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇలా ప్రతీ రాష్ట్రం కేంద్రం పరిమితిని దాటి విచ్చలవిడిగా అప్పులు చేస్తూ పోతే కేంద్రం మౌనంగా ఉండే పరిస్ధితులు కూడా ఉండకపోవచ్చు.