YS Jagan, Adani : ఏపీలో అదానీ గ్రూప్ సంస్ధలపై జగన్ సర్కార్ ప్లాన్ ఇదే..!
అదానీ గ్రూప్ సంస్ధలపై హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఏపీలో ఆ గ్రూప్ కు చెందిన సంస్ధల్ని భవిష్యత్తులో ప్రోత్సహించాలా వద్దా అనే విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ గ్రూప్ కు చెందిన అదానీ పోర్ట్స్ తో పాటు పలు సంస్ధలు రాష్ట్రంలో క్రమంగా పాగా వేశాయి. వీటికి ప్రభుత్వం కూడా భారీగా భూకేటాయింపులు కూడా చేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ భేటీలోనూ రెండు చోట్ల అదానీ గ్రూప్ సంస్ధలకు దాదాపు 500 ఎకరాల స్ధలం కేటాయించారు. అయితే హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో భవిష్యత్తులో అదానీ సంస్ధలకు ఏపీలో ఎంట్రీ ఉంటుందా లేదా అన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.

ఏపీలో అదానీ గ్రూప్ హవా
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఎంట్రీ ఇచ్చిన అదానీ గ్రూప్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా అడుగులేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైన కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని లీజు ప్రాతిపదికన చేజిక్కించుకుంది. సీఎం జగన్ తో పలుమార్లు భేటీ అయిన గ్రూపు అధినేత గౌతం అదానీ, ఆయన సోదరులు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
దీంతో ఓ దశలో విశాఖలో కేంద్రం ప్రైవేటీకరిస్తున్న స్టీల్ ప్లాంట్ సైతం అదానీ చేతుల్లోకే వెళ్లబోతోందన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఆలోపే అదానీ గ్రూప్ కు హిండెన్ బర్గ్ రిపోర్ట్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

హిండెన్ బర్గ్ రిపోర్ట్ దెబ్బ
అయితే తాజాగా వెలువడిన హిండెన్ బర్గ్ రిపోర్ట్ దెబ్బ అదానీ గ్రూప్ సంస్ధలపై, షేర్లపై భారీగా పడింది. స్టాక్ ఎక్చేంజ్ ల్లో అదానీ గ్రూప్ షేర్లు వరుసగా పతనం కాగా..సంస్ధల మార్కెట్ వ్యాల్యూ కూడా దాంతో పాటే భారీగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ఏపీలో పెట్టిన సంస్ధల పరిస్ధితి కూడా అగమ్య గోచరంగా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అదానీ గ్రూప్ భవిష్యత్ వ్యూహాలపైనా ఈ ప్రభావం పడబోతోంది. ఈ మేరకు జగన్ సర్కార్ నిన్న కేబినెట్ భేటీ తర్వాత సంకేతాలు ఇచ్చేసింది.

కేబినెట్లో భూకేటాయింపులు
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత పడిన ప్రభావం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని సమీక్షిస్తుందా, భూకేటాయింపులు రద్దు చేస్తుందా అని ఎదురుచూస్తున్న వేళ.. అనూహ్యంగా రెండు చోట్ల కొత్తగా అదానీ గ్రూప్ సంస్ధలకు భూములు కేటాయిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న కేబినెట్ భేటీలో దీనికి ఆమోద ముద్ర వేశారు.
దీని ప్రకారం విశాఖలో ఏర్పాటు చేసే డేటాసెంటర్, ఇతర సంస్ధల కోసం 60 ఎకరాల భూమి కేటాయించగా.. అనంతపురం జిల్లాలో అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేసే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కోసం మరో 406 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

అదానీపై జగన్ ప్లాన్ ఇదే!
అయితే కేబినెట్లో అదానీ సంస్ధలకు రెండు చోట్ల 466 ఎకరాల భూ కేటాయింపుల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ.. అదానీ చేతిలో మోసపోయేది లేదన్నారు. హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలు పునస్సమీక్షిస్తారా అన్న ప్రశ్నకు ఇప్పటికే అమల్లో ఉన్న విధానాల ప్రకారం రాయితీలు ఇస్తున్నామని, భవిష్యత్తులో కొత్తగా ఏమీ ఇచ్చేది లేదన్నారు.
తద్వారా భవిష్యత్తులో కొత్తగా అదానీ గ్రూప్ ప్రాజెక్టుల్ని అనుమతించబోమని జగన్ సర్కార్ సంకేతాలు ఇచ్చినట్లయింది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల్ని మాత్రం అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications