ఆపరేషన్ అశోక్ పార్ట్ -2 - రామతీర్ధంలో మంత్రులు-హైకోర్టులో సంచైత- రాజుగారి ఇగోనే టార్గెట్
ఏపీలో విజయనగరంలోని పూసపాటి రాజవంశీకుడైన అశోక్ గజపతిరాజుపై వైసీపీ ప్రభుత్వం గతంలో ప్రారంభించిన ఆపరేషన్ విఫలమైంది. ఆయన్ను విజయవంతంగా మాన్సాస్ ఛైర్మన్ పదవిలో నుంచి తప్పించి, ఆ స్ధానంలో సంచైతను అర్ధరాత్రి జీవీలతో కూర్చోబెట్టిన జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అశోక్ ను తిరిగి మాన్సాస్ ఛైర్మన్ గా నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. అలాగే రామతీర్ధం ఆలయ ఛైర్మన్ గా కూడా పునరుద్ధరించింది. దీంతో కొంతకాలంగా మౌనంగా ఉన్న ప్రభుత్వం ఇవాళ ఆపరేషన్ -2 ప్రారంభించింది.
అశోక్ పై జగన్ సర్కార్ పోరు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయనగరంలోని పూసపాటి రాజవంశానికి చెందిన టీడీపీ నేత అశోక్ గజపతిరాజును టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మాన్సాస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. ఆయన స్ధానంలో అన్న కూతురు సంచైతను కూర్చుబెట్టింది. దీనిపై హైకోర్టునుూ ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా మాన్సాస్ లో ఆడిట్ పేరుతో ఆయన్ను వేధించింది. అధికారులు ఆయన మాట వినకుండా కట్టడి చేసింది. చివరికి అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో కొన్నాళ్లుగా మౌనంగా ఉంటోంది.
అన్ని ప్రయత్నాలూ విఫలం
అశోక్ గజపతిరాజును అవినీతి పరుడుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించిన జగన్ సర్కార్ విఫలమైంది. పూసపాటి వంశ వారసుడిగా మాన్సాస్ ఛైర్మన్ పదవి అధిష్టించడానికి అర్హత లేదని వాదించీ విఫలమైంది. మాన్సాస్ భూముల్లో అక్రమాలు జరిగాయని వాదించీ విఫలమైంది. అంతెందుకు అశోక్ స్ధానంలో సంచైతను కూర్చుబెట్టి దాన్ని ఎలా సమర్ధించుకోవాలో తెలియక ప్రభుత్వం నానా తిప్పలు పడింది. మాన్సాస్ లో అక్రమాలపై ఆడిట్ పేరుతో హంగామా చేసి దాన్నీ నిరూపించలేకపోయింది. చివరికి మాన్సాస్ లో మహిళలపై వివక్ష అంశాన్ని కూడా తెరపైకి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఆపరేషన్ 2 ప్రారంభం
గతంలో అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ విఫలం కావడంతో ప్రభుత్వం తాజాగా ఆపరేషన్ 2 ప్రారంభించినట్లు అర్ధమవుతోంది. ఇందులో భాగంగా రామతీర్ధం ఆలయం పునర్నిర్మాణం పేరుతో కొత్త వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. గతంలో ఇక్కడ రాములోరి విగ్రహం శిరచ్ఛేదం జరిగిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేసినా, వారి మనోభావాలు దెబ్బతిన్నా ఇప్పటికీ దోషుల్ని పట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వం తాజాగా కొత్త ఆలయం నిర్మాణం పేరుతో ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో హైకోర్టులో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా అశోక్ పునర్ నియామకాన్ని సవాల్ చేస్తూ సంచైత పిటిషన్ దాఖలు చేసింది.
రాజుగారి ఇగోపై దెబ్బ కొట్టే వ్యూహం
జగన్ సర్కార్ ఆశోక్ గజపతిరాజుపై ఇవాళ ఆపరేషన్ 2 ప్రారంబించింది. ఇందులో భాగంగా ఆయన్ను నేరుగా ఎదుర్కోవడం కష్టమేనని భావిస్తున్న ప్రభుత్వం ఆయన ఇగోపై దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయన్ను రామతీర్ధం ఆలయ శంఖుస్ధాపన సందర్భంగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు అశోక్ ను టార్గెట్ చేస్తూ శిలాఫలకంపై ధర్మకర్తకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా పక్కనబెట్టారు. అదేమని ప్రశ్నిస్తే పక్కకు నెట్టేశారు. తద్వారా రాజుగారి అహాన్ని దెబ్బతీసేందుుకు వైసీపీ మంత్రులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.