రాజధానులకు జగన్ లైన్ క్లియర్- ఏఎంఆర్డీయే పనులకు గ్రీన్సిగ్నల్- కోర్టు తీర్పుల నేపథ్యం..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్ క్రమంగా లైన్ క్లియర్ చేస్తున్నారు. రాజధానుల ఏర్పాటులో కేంద్రం పాత్ర లేదని తేలిపోవడంతో ఇక ప్రధాన అడ్డంకిగా ఉన్న అమరావతి ప్రాజెక్టులు, రైతుల హామీలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో సీఆర్డీయే స్ధానంలో ఏర్పాటైన అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ( ఏఎంఆర్డీయే) పేరుతో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పనుల పూర్తికి నిర్ణీత షెడ్యూల్ ఇవ్వడం ద్వారా అమరావతికి తాము అన్యాయం చేయడం లేదని న్యాయస్ధానాల్లో వాదన వినిపించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు రాజధానుల ప్రక్రియ...
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే రాజదాని బిల్లులకు గవర్నర్ ఆమోదం తీసుకున్న ప్రభుత్వం.. న్యాయప్రక్రియలో ఇబ్బందులనూ తొలగించేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. కోర్టుల్లో ప్రధాన అభ్యంతరంగా ఉన్న రాజధాని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అమరావతి రైతులకు ఇచ్చిన హామీల విషయంలోనూ స్పష్టమైన ప్రణాళిక అనుసరించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు న్యాయస్ధానాలకు హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. తాజాగా సీఎం జగన్ నిర్వహించిన అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సమీక్షలోనూ ఇదే విషయం స్పష్టమైంది.

ప్రధాన అభ్యంతరాలివే...
రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించేందుకు ఈ ప్రాంత రైతులు చెబుతున్న ప్రధాన అభ్యంతరం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోడమే. అంటే రైతులకు రాజధాని పేరుతో అభివృద్ధి చేసిన ఫ్లాట్లను ఇవ్వడం, అలాగే అమరావతిలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా వీటికి మంచి ధర పలికే పరిస్ధితి కల్పించడం. ఈ రెండు హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చగలిగితే రాజధాని రైతుల్లో నెలకొన్న భయాందోళనలకు ఫుల్స్టాప్ పెట్టొచ్చనేది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో పాటు ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారాన్ని బట్టి ప్రభుత్వం ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్..
అమరావతిలో గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన ప్రాజెక్టులు, వాటిలో అవసరాన్ని బట్టి వర్గీకరించిన తర్వాత వాటికి అయ్యే వ్యయాన్ని దాదాపు రూ.18 వేల కోట్లుగా ఐఐటీ నిపుణుల సాయంతో సీఆర్డీయే అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. వీటిలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టగలిగితే ఇక్కడి రైతులు, స్ధానికులకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని, తిరిగి భూముల ధరలు కూడా పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. అందుకే ముందుగా బ్రాండ్ వ్యాల్యూ కలిగిన హ్యాపీ నెస్ట్ వంటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇదే క్రమంలో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపబోతోంది. తద్వారా అమరావతి ప్రాజెక్టులను తాము నిర్లక్ష్యం చేయడం లేదనే సంకేతాలు పంపబోతోంది.
Recommended Video

కోర్టు తీర్పుల నేపథ్యంలో ...
ప్రస్తుతం మూడు రాజధానులపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలై ఉన్నాయి. వీటిలో అత్యధికం రాజధాని ప్రాంత రైతులు, స్ధానికులు దాఖలు చేసినవే. వీటిలో ప్రధానంగా రాజదాని తరలిపోవడం వల్ల తమకు నష్టం జరుగుతోందంటూ వీరు అభ్యంతరాలు చెబుతున్నారు. కాబట్టి రాజధాని వికేంద్రీకరణ నేపథ్యంలో మూడు రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఎలాగో ఉంటుందని, ఇక్కడ అభివృద్ధికీ తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేందుకు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం కోర్టులకు చెప్పబోతోంది. తాజాగా హ్యాపీనెస్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను సాక్ష్యాలుగా చూపబోతోంది. దీంతో కోర్టులు సంతృప్తి చెందితే మూడు రాజధానులకు ఉన్నఅవాంతరాలు తొలగిపోతాయని వైసీపీ సర్కారు అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications