ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులకు జగనన్న బంపర్ ఆఫర్.. !
ఏపీలో ఉద్యోగులకు ఎన్నికల ఏడాది వరుస ఆఫర్లు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ వారికి మరో గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఈసారి మాత్రం అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ఓ ఆఫర్ ఇచ్చారు. ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉండేలా సచివాలయ ఉద్యోగులకు ఈ ఆఫర్ ప్రకటించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ఈ ఆఫర్ ను వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వస్త్రాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఉన్న ఆప్కో విక్రయ శాల ద్వారా ఈ నెలాఖరు వరకు ఈ వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె.సునీత ప్రకటించారు. హుందాతనాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని కల్పించే చేనేత వస్త్రాలను ఉద్యోగులు అంతా విరివిగా ధరిస్తూ చేనేత కార్మికులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇవాళ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సునీత.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వస్త్రాలను తప్పని సరిగా ధరించాలనే విదానాన్ని అమలు పర్చారన్నారు. అయితే శనివారం సెలవు దినం అవ్వడం వల్ల ఆ సాంప్రదాయం గాడి తప్పిందన్నారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వస్త్రాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు.
చేనేత వస్త్రాలు సౌకర్య వంతంగా ఉంటాయని, పురాతన కాలం నుండి చేనేత వస్త్రాలను ధరించడం సాంప్రదాయంగా కొనసాగుతున్నదని ఆమె తెలిపారు. ఉద్యోగులూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో 90 విక్రయశాలలను ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులను ఆకర్షించే విధంగా కొత్త డిజైన్లతో పలు వస్త్రాలను విక్రయిస్తామన్నారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు 3 నుండి 5 వాయిదాల్లో కొనుగోలు సొమ్మును చెల్లించేదుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట రామి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె.సునీత చొరవతోనే సచివాలయం ఆవరణలో ఆప్కో విక్రయ శాలను ఏర్పాటు చేయడం జరిగిందటూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత వస్త్రాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చేనేత వస్త్రాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి బహుమతులను అందజేశారు.












Click it and Unblock the Notifications