జగన్ సర్కార్ మరో సంచలనం- జడ్జి పక్షపాతం-విచారణ నుంచి తప్పించాలని అఫిడవిట్
ఏపీలో హైకోర్టుతో ముఖాముఖీ పోరు సాగిస్తున్న జగన్ సర్కార్ మరో సంచలనానికి తెరలేపింది. ఈసారి ఏకంగా హైకోర్టు జడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ ఓ కీలకమైన కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరింది. సదరు కేసుల విచారణలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నందున ఆయన్ను తప్పించాలని హైకోర్టును కోరుతూ అపిడవిట్ దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది. దీంతో ఈ ఈ వ్యవహారం మరో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకోబోతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
మిషన్ బిల్డ్ ఏపీ పథకం..
ఏపీలో మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద ప్రభుత్వం సర్కారీ భూములను అమ్మకానికి పెడుతోంది. అసలే ఆర్దిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రభుత్వం సర్కారీ భూములను అమ్మడం ద్వారా భారీ ఎత్తున నిధుల సేకరణకు సిద్ధమైంది. ఇప్పటికే విజయవాడ, గుంటూరుతో పాటు పలు ప్రధాన ప్రాంతాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. ప్రభుత్వ భూములకు కాపలాదారుగా ఉండాల్సిన ప్రభుత్వమే వీటిని అమ్మేయడంపై విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టులో మిషన్ బిల్డ్ ఏపీ కేసులను విచారణ జరుపుతోంది.
జస్టిస్ రాకేష్ కుమార్ కామెంట్స్తో సర్కారుకు షాక్
ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జరుగుతున్న చాలా కేసుల విచారణ తరహాలోనే ఈ కేసు విచారణలోనూ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం దివాలా తీసిందా అని తాజాగా ప్రశ్నించారు. భూములు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అంత దయనీయంగా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అలాగని బిల్డ్ ఏపీ పథకం కొనసాగించాల్సిందేనని హైకోర్టులో గట్టిగా వాదించలేని పరిస్ధితి. దీంతో ఈ కేసులో ప్రతికూల తీర్పు రావడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ జడ్జి మాకొద్దంటూ జగన్ సర్కార్ అఫిడవిట్
మిషన్ బిల్డ్ ఏపీ కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న జడ్జి జస్టిస్ రాకేష్ కుమార్ను తప్పించాలని కోరుతూ ప్రభుత్వం అసాధారణ రీతిలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. బిల్డ్ ఏపీ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ కేసుల్లో జస్టిస్ రాకేష్ కుమార్ పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వం అఫిడవిట్లో ఆరోపించింది. ఇందుకు ఆధారాలుగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల పేపర్ క్లిపింగ్స్, ఇతర సాక్ష్యాలు సమర్పించింది. గతంలో సుప్రీంకోర్టు కూడా కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వారు కోరిన మీదట జడ్జిలను కేసు విచారణ నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయని అఫిడవిట్లో గుర్తు చేసింది. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.
రాజ్యాంగ విచ్ఛిన్నం వ్యాఖ్యలతో...
ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పలు కీలక కేసుల్లో జస్టిస్ రాకేష్ కుమార్ విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేల్చేందుకు జరుగుతున్న విచారణలోనూ ఆయనే న్యాయమూర్తిగా ఉన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నం పేరుతో కేసు విచారణ కోసం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఆయన్ను ప్రభుత్వం కోరినా పట్టించుకోలేదు. అనంతరం మిషన్ బిల్డ్ ఏపీ కేసుల విచారణ నుంచి ఆయన్ను తప్పించాలని సర్కారు అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. పలు కేసుల్లో తమను టార్గెట్ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ను తప్పించాలని కోరడం ద్వారా ప్రభుత్వం ఈ వ్యవహారంపై చర్చ జరగాలని కోరుకుంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.