ఏపీలో స్కూలు పిల్లలకు జగన్ మామయ్య మరో శుభవార్త...
ఏపీలో అక్షరాస్యత శాతం పెంచేందుకు వీలుగా విద్యారంగంలో ప్రభుత్వం భారీ సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్ధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు నాడు-నేడు కార్యక్రమం, పిల్లల్ని చదివించుకునేందుకు తల్లులకు అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక వంటి పలు పథకాల్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యార్ధుల్లో మానసిక స్థైర్యం పెంచేందుకు మరో కొత్త విధానం అమల్లోకి తీసుకురాబోతోంది.
ఏపీలోని వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల్లో మానసిక స్ధైర్యం పెంచడంతో పాటు స్కూళ్లకు దూరంగా ఉండిపోతున్న విద్యార్ధుల్ని తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు ప్రభుత్వం కొత్తగా స్టూడెంట్ కౌన్సెలర్ల విధానం అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా విద్యామంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మండలాల వారీగా ఈ స్టూడెంట్ కౌన్సెలర్లను నియమించాలని నిర్ణయించారు.

విద్యార్దుల్ని రోజూ స్కూలుకు పంపేలా తల్లితండ్రులకు కౌన్సెలింగ్ చేయడం, స్కూళ్లకు వస్తూ మధ్యలో మానేస్తుంటే తిరిగి వారిని స్కూళ్లకు రప్పించేలా చూడటం, వారి సమస్యల్ని తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తెలియజేయడం వంటి కార్యక్రమాలు చేసేందుకు వీలుగా విద్యార్ది కౌన్సెలర్లను నియమించబోతున్నారు. తద్వారా స్కూళ్లకు వచ్చే విద్యార్ధుల సంఖ్య పెంచడం, ప్రభుత్వ పథకాలు, సాయం వారికి సక్రమంగా అందేలా చూడటం చేయబోతున్నారు.
ప్రభుత్వం అక్షరాస్యత పెంపుకు భారీ ఎత్తున నిధులు ఖర్చుపెడుతున్నా విద్యార్ధులను స్కూళ్లకు రప్పించడంలో ఉపాధ్యాయులు, స్ధానిక అధికారులు విఫలమవుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పటికే టీచర్లతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ నేరుగా వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నారు. అలాగే విద్యాసంస్కరణల అమలు విషయంలోనూ ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశాలు ఇస్తున్నారు. అలాగే పాఠశాలల విభజనతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఐదేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో వీటి ఫలితాలు వచ్చేలా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications