జగన్ టార్గెట్ లో నిమ్మగడ్డ శరణ్య- ఈడీబీ వ్యవహారాలపై ఆరా ? కృష్ణకిషోర్ బాటలోనే...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్ధిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ)లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాల వ్యవహారంలో ఇప్పటికే సీఈవో, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ ను సస్పెండ్ చేసిన వైసీపీ సర్కారు ఇప్పుడు ఆయనతో పాటు బోర్డు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ శరణ్య పాత్రపై దృష్టిపెట్టింది. జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ ను తాజాగా రద్దు చేసిన క్యాట్.. ఆయన్ను కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే అక్రమాలపై విచారణ మాత్రం కొనసాగించుకోవచ్చని పేర్కొంది. దీంతో శరణ్య వ్యవహారం తెరపైకి వస్తోంది.

ఎవరీ నిమ్మగడ్డ శరణ్య ?
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్తె అయిన నిమ్మగడ్డ శరణ్య.. 2016 కంటే ముందే ఎక్కడో సింగపూర్ లో కార్పోరేట్ లాయర్ గా పనిచేస్తుండేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తనకున్న పరపతితో ఏపీ ఆర్ధిక అభివృద్ధి మండలిలో అసోసియేట్ గా పనిచేసే అవకాశం శరణ్యకు దక్కింది. ఆ తర్వాత ఏడాది కాలంలోనే అసోసియేట్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు. ఇదే హోదాలో గతేడాది అక్టోబర్ వరకూ పనిచేశారు. ఏపీఈడీబీలో అక్రమాలు వెలుగుచూసిన నేపథ్యంలో అక్కడి నుంచి తప్పుకున్నారు.

ఏపీఈడీబీలో శరణ్య పాత్ర..
ఏపీ ఆర్ధిక అభివృద్ది మండలి (ఈడీబీ)లో శరణ్య అసోసియేట్ నుంచి అసోసియేట్ డైరెక్టర్ వరకూ ఎదిగారు. అసోసియేట్ గా చేరిన ఏడాదికే ఆమె అసోసియేట్ డైరెక్టర్ గా ప్రమోట్ కావడం అప్పట్లో ఓ ఎత్తు. అయితే ఏపీకి పెట్టుబడులు సాధించే పేరుతో దేశవిదేశాలకు ఆమె తిరిగిన టూర్లు మరో ఎత్తు. అదే సమయంలో ఏపీఈడీబీలో జరిగిన అవినీతిపై తాజాగా సీబీడీ కేసులు నమోదు చేసింది. అయితే సీఈవోగా జాస్తి కృష్ణకిషోర్ వ్యవహారాలపైనా తొలుత దృష్టి పెట్టిన సీఐడీ ఇప్పుడు మొత్తం లావాదేవీలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దీంతో బోర్డులో కృష్ణకిషోర్ తో కలిసి పనిచేసిన శరణ్య పాత్ర ఏంటన్నది తేల్చిపనిలో పడింది.

నిమ్మగడ్డ కుమార్తె కాబట్టేనా ?
ఏపీఈడీబీలో నిమ్మగడ్డ శరణ్య చోటు సంపాదించడం వెనుక ఆమె తండ్రి అప్పట్లో పలు కీలక పదవుల్లో పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరపతి కూడా ఉండొచ్చనేది వైసీపీ ప్రభుత్వ వర్గాల అనుమానం. అయితే శరణ్య ఈడీబీలోకి ఎలా వచ్చిందనే దాని కంటే అక్కడ జరిగిన పలు లావాదేవీల్లో ఆమె పాత్ర ఏమైనా ఉందా అనే అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడ్డ నేపథ్యంలో ఇందుకు కారణమైన ఎన్నికల కమిషనర్, శరణ్య తండ్రి రమేష్ కుమార్ పై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికీ రమేష్ కుమార్ పై విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే ఆమెపై విచారణ ప్రారంభిస్తే విమర్శలు వస్తాయనే కారణంతో కొంతకాలం ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఎదురుతన్నిన కృష్ణకిషోర్ సస్పెన్షన్..
గత టీడీపీ ప్రభుత్వం అండ చూసుకుని పెట్టుబడుల పేరుతో సీఈవో కృష్ణకిషోర్ తో పాటు ఇతర బోర్డు సభ్యులు విదేశాల్లో తిరిగొచ్చారని, అయితే వచ్చిన పెట్టుబడులేవీ లేవనేది వైసీపీ వర్గాల ప్రధాన ఆరోపణ. అయితే ఇదే అంశంపై జాస్తి కృష్ణకిషోర్ పై దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ చివరికి స్టేషనరీ కొనుగోళ్లలో కోటి రూపాయలు దుర్వినియోగం చేసినట్లు మాత్రమే గుర్తించింది. దీన్ని కారణంగా చూపుతూ ప్రభుత్వం కృష్ణకిషోర్ పై సస్పన్షన్ వేటు వేసింది. అయితే ఆయన క్యాట్ కు వెళ్లి సస్పెన్షన్ రద్దు చేయించుకోవడమే కాక కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. అయితే ఈడీబీ వ్యవహారాల్లో కృష్ణకిషోర్ పాత్రపై సీఐడీ దర్యాప్తు మాత్రం జరుగుతూనే ఉంది. ఇందులో శరణ్య పాత్రను నిర్ధారించేలా ఆధారాలు సంపాందించేందుకు సీఐడీ ప్రయత్నిస్తూనే ఉంది. త్వరలో దీనిపై ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో శరణ్య పాత్ర నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications