ప్రభుత్వ సమాచారం లీక్ - ముగ్గురు అధికారులపై వేటు: జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం..!!
ప్రభుత్వ ఆర్దిక వ్యవహారాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉద్దేశ పూర్వకంగా లీక్ చేసారనే కారణంతో ముగ్గురు అధికారుల పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ ఆర్దిక శాఖలో పని చేస్తున్న ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఆర్దిక శాఖ వ్యవహారాల పైన మీడియాలో వస్తున్న కథనాల పైన విజిలెన్స్ ఫోకస్ పెట్టింది. విచారణ చేపట్టింది. అందులో ముగ్గురు అధికారుల పైన చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది.
ముగ్గురు అధికారుల సస్పెండ్..
దీంతో...ఆర్దిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న నాగులపాటి వేంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసర్లుగా పని చేస్తున్న డి శ్రీనుబాబు, కసిరెడ్డి వర ప్రసాద్ లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనలో భాగంగా సున్నితమైన...రహస్యంగా జరగాల్సిన వ్యవహారాలను ఉద్దేశ పూర్వకంగా బయటకు లీక్ చేశారని విజిలెన్స్ నివేదికలో వెల్లడించింది. ఈ ఫైలింగ్ ద్వారా నడుస్తున్న వ్యవహారాలను కావాలని లీక్ చేసారని నిర్ధారించారు. ఆర్దిక శాఖలో ఈ ముగ్గురి నుంచే విలువైన..సున్నితమైన సమాచారం బయటకు వెళ్తుందని విజిలెన్స్ విచారణలో తేలింది.
అనుమతి లేకుండా వెళ్లకూడదు..
ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..సంబంధిత అధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వీడి వెళ్లకూడదని నిర్దేశించింది. కొద్ది రోజులుగా ఏపీ ఆర్దిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందంటూ పెద్ద ఎత్తున కధనాలు వస్తున్నాయి. అదే సమయంలో పీఏసీ ఛైర్మన్ పయ్యావుల సైతం వరుసగా మీడియా సమావేశాలతో ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసారు. కేంద్రం - రాష్ట్రం మధ్య జరుగుతున్న ఆర్దిక సంబంధింత వ్యవహారాల లేఖలను బహిర్గతం చేసారు.
Recommended Video
రహస్యంగా..సున్నితమైన సమాచారాన్ని లీక్
ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాల పైన రుణాలు తీసుకోవటం పైన పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. దీంతో..కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు అందాయి. ప్రభుత్వంలో కీలకమైన సమాచారాన్ని ఈ ముగ్గురు అధికారులు కావాలనే మీడియాకు..ప్రతిపక్షాలకు లీకులు ఇచ్చారనేది ప్రధాన అభియోగం. విజిలెన్స్ విచారణ తరువాత వీరి పైన చర్యలు తీసుకుంటూ ఆర్దిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ ఉత్తర్వులు జారీ చేసారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పైన ఉద్యోగ సంఘాల నేతలు ఎలా రియాక్ట్ అవుతాయనేది వేచి చూడాలి.