మోడీని ఒక్కమాట కూడా అనలేని పిరికిపంద జగన్:మంత్రి నక్కా ఆనందబాబు
అమరావతి:ప్రతిపక్షనేత జగన్ పై టిడిపి నాయకుల విమర్శలు,ఆరోపణలు మరింత జోరందుకుంటున్నాయి. గుంటూరులో మంత్రి నక్కా ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒక్కమాట అనలేని పిరికిపంద జగన్మోహన్రెడ్డి అని ద్వజమెత్తారు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్ర సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఆరోపణలపై తీవ్రంగా ప్రతిస్పందించిన నిమ్మల రామానాయుడు గజ దొంగలా జగన్ రాష్ట్రాన్ని దోచేశాడు...జగన్ ప్రజల్లో కాదు... మెంటల్ హాస్పటల్లో ఉండాలి... అంటూ మీడియా సమావేశంలో మండిపడ్డారు.

గుంటూరులో...మంత్రి నక్కా ఆనందబాబు
మంత్రి నక్కా ఆనందబాబు ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ...జగన్ వట్టి పిరికిపంద అని...అందుకే ప్రధాని నరేంద్రమోడీని ఒక్కమాట కూడా విమర్శించేందుకు వణికిపోతున్నాడని మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. వైసిపి ఎంపీల రాజీనామాలను ఇంతరవకు ఆమోదించకపోవడం నయవంచన కాదా అని మంత్రి ప్రశ్నించారు. వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికల్లో ఓడిపోతారని భయపడుతున్నారని, జగన్ పాదయాత్రలు, వంచన యాత్రలు...ఈ నాటకాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. అలాగే పవన్ ను జగన్...జగన్ ను పవన్ ను విమర్శించడని... ప్రజలు ఇది కూడా గమనిస్తున్నారన్నారు.

కన్నాకు బుద్ది...మంత్రి నక్కా
ఇక ఇటీవలే ఎపి బిజెపి అధ్యక్షుడైన కన్నా లక్ష్మీనారాయణ సిఎం చంద్రబాబునాయుడిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడని, ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడే కన్నా లక్ష్మీనారాయణ ఇన్నాళ్ళు ఎక్కడ నిద్రపోయాడని ప్రశ్నించారు. చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కన్నాకు ఒక్క రాత్రికే బీజేపీ సిద్దాంతాలు నచ్చాయా అని మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు. రాత్రికి రాత్రి పార్టీ మారి విలువలు లేకుండా మాట్లాడితే తగిన బుధ్ది చెప్తామని కన్నాకు మంత్రి నక్కా ఆనందబాబు ఘాటుగా హెచ్చరించారు.

జగన్...ఆ కథలు దాచుకో!
పాలకొల్లు పర్యటనలో జగన్ తమ పార్టీనిగాని, ముఖ్యమంత్రినిగాని, తననుగాని విమర్శిస్తూ మాట్లాడేందుకు ఏమాత్రం అర్హత లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. ఏఎంసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నిమ్మల రామానాయుడు జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని దోచేసిన ఘనత జగన్దని, తాము అభివృద్ధి కోసం పగలు, రాత్రి కష్టపడడమే కాకుండా, లోటు బడ్జెట్లోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.నర్సయ్య లాంటి పిట్టకథలు జాగ్రత్తగా దాచుకుంటే జైలులో తోటి ఖైదీలకు చెప్పుకునేందుకు పనికి వస్తాయని ఎద్దేవా చేశారు. జగన్ పాలకొల్లులో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని, అలా వస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

మాట్లాడే తీరు...హాస్యాస్పదం
ఇదే సమావేశంలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ జగన్ పాదయాత్ర సభల్లో మాట్లాడే తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ అభివృద్ది గురించి మాట్లాడటం...ప్రజలకు అవసరమైన కార్యక్రమాల గురించి సూచించడం లాంటివి చేయకుండా కేవలం విమర్శలకే పరిమితమవడం సరికాదన్నారు. ప్రజా సంక్షేమం గురించి కూడా జగన్ పట్టించుకోవాలని...కేవలం రాజకీయ పార్టీలనే విమర్శించడమే పనిగా పెట్టుకోవడం తగదని హితవు పలికారు.












Click it and Unblock the Notifications