అపెక్స్ కౌన్సిల్ భేటీ- విజయవాడకు కృష్ణా బోర్డు తరలింపు- 4 అంశాలకు కేసీఆర్, జగన్ ఒకే...
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు జల వివాదాల పరిష్కారం కోసం ఇవాళ కేంద్ర జల్శక్తి మంత్విత్వశాఖ నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ భేటీ విజయవంతమైనట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మొత్తం నాలుగు అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన ప్రకటించారు. ఇందులో కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం తరలింపుతో పాటు ఇతర అంశాలున్నాయి.
ఏపీ విభజన పూర్తయి ఆరేళ్లు గడుస్తున్నా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై క్లారిటీ రాకపోవడంపై కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇవాళ జరిగిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఇతర అధికారుల భేటీలో మాత్రం పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు షెకావత్ తెలిపారు. ఇందులో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని నిర్ణయించారు.
Recommended Video
కృష్ణా, గోదావరి నదులపై ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా దానికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని కేంద్రమంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్లు సమర్పించేందుకు కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్రం త్వరలోనే నిర్ణయిస్తుందని షెకావత్ వెల్లడించారు. విభజన చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉంటాయన్నారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని, ఇందుకు సహకరించిన ఇద్దరు ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.