జగన్ - కేటీఆర్ ల భేటీ అనైతికం..! మండి పడుతున్న టీడిపి నేతలు..!!
విజయవాడ/ హైదరాబాద్ : లోటస్ పాండ్ లో తలపెట్టిన కీలక మీటింగ్ ముగిసింది. వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల భేటీ అనంతరం వారిద్దరూ మీడియా ముందుకు వచ్చారు. మొదట కేటీఆర్ మాట్లాడగా, అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా లోటస్ పాండ్ లో జగన్, కేటీఆర్ భేటీని టీడిపి నేతలు తప్పుబడుతున్నారు. కేంద్ర బీజేపి చెప్పు చేతల్లో ఉన్న వైసీపి, టీఆర్ఎస్ పార్టీలు అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నాయని ఏపి తో తెలంగాణ టీడిపి నేతలు మండి పడుతున్నారు. ఏపిలో టీడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తెలంగాణలో టీటీడిపి అద్యక్షుడు యల్ రమణ గులాబీ, వైసీపి పార్టీల ములాఖత్ ను ఖండించారు.
ఫెడరల్ ఫ్రంట్ ప్రధాని మోడీ డైరెక్షన్లో నడుస్తోందని ప్రభుత్వ విఫ్ బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ అధ్మక్షుడు చంద్రబాబు నాయుడి మహాకూటమిని నీరుగార్చేందుకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఏపీకా అన్యాయం జరిగినా పరవాలేదు తన కేసులు మాఫీ అయితే చాలు అన్నట్లు జగన్ భావిస్తున్నారని అన్నారు. ఈ రోజు వైసీపి, టీఆర్ఎస్ ముసుగుతీసాయని, అందుకు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు. రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదని అంతకంటే పెద్ద రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ కు మేము కూడా ఇస్తామని బుద్దా వార్నింగ్ ఇచ్చారు. ఇక వైయస్ కుంటుంబాన్ని ఎప్పుడూ దూషించే కేసీఆర్ ఆయన కుమారుడు జగన్ తో ఎలా దోస్తీ చేస్తారని తెలంగాణ టీడిపి అద్యక్షుడు యల్ రమణ మండిపడ్డారు.