డొల్ల కంపెనీల పేర్లతో విదేశాలకు డబ్బు: జగన్కు షాక్, ఈడీ టాప్ 10 జాబితాలో పేరు
షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను విదేశాలకు పంపించడం, ఆ తర్వాత ఆ డబ్బులు అవసరమైనప్పుడు పెట్టుబడుల రూపంలో విదేశీ కంపెనీల ద్వారా భారత్కు రప్పించడం.. ఇది మనీ లాండరింగ్.
Recommended Video
అమరావతి/న్యూఢిల్లీ: షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులను విదేశాలకు పంపించడం, ఆ తర్వాత ఆ డబ్బులు అవసరమైనప్పుడు పెట్టుబడుల రూపంలో విదేశీ కంపెనీల ద్వారా భారత్కు రప్పించడం.. ఇది మనీ లాండరింగ్.
ఇలా హవాలా మార్గంలో విదేశాలకు పెద్ద ఎత్తున డబ్బులు తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ జాబితాను ఈడీ రూపొందించింది. ఇందులో కొందరు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది.
వీరిద్దరి పేర్లు టాప్లో
సూరత్కు చెందిన అఫ్రోజ్ మహ్మద్ హసన్ఫట్టా, మదన్లాల్ జైన్లు ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. తప్పుడు బిల్లులతో దుబాయ్, హాంకాంగ్లకు డబ్బును తరలించిన అభియోగాలను ఎదుర్కొంటున్నారు. 30 డొల్ల కంపెనీల ద్వారా వీరిద్దరూ కలిపి రూ.5400 కోట్లు తరలించిన ఆరోపణలు ఉన్నాయి.
జగన్, ఛగన్ భుజ్లాల్ల పేర్లు
వైయస్ జగన్, ఆయన అనుచరులకు చెందిన 31 డొల్ల కంపెనీల ద్వారా కనీసం రూ.368 కోట్లు అక్రమంగా చలామణి చేసినట్లు జాబితాలో ఉందని, మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఛగన్ భుజ్బల్ 81 డొల్ల కంపెనీల ద్వారా రూ.200 కోట్లు అక్రమంగా చలామణి చేసినట్లు ఈడీ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈడీ వెల్లడించిన 12 పేర్లలో జగన్ పేరు 10వ స్థానంలో ఉంది.
ఈడీ జాబితాలో రెండో స్థానంలో ఇది
కనీసం 13 కంపెనీల ద్వారా రూ.60 కోట్లు కొల్లగొట్టిన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్య కార్యదర్శి బాబూలాల్ అగర్వాల్ పేరు కూడా ఇందులో ఉంది. అక్రమ డబ్బు చలామణికి పాల్పడిన ఎన్కేఎస్ హోల్డింగ్స్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ ఈడీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
డొల్ల కంపెనీల పరంగా చూస్తే
ఆ తర్వాత స్థానంలో ఢిల్లీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా కేసు నిందితులు ఉన్నారు. డొల్ల కంపెనీల సంఖ్య పరంగా చూస్తే ముంబైకి చెందిన రాజేశ్వర్ ఎక్స్పోర్ట్స్ అగ్రస్థానంలో ఉంది. భారీగా డబ్బు చలామణి జరిగిన నగరాల్లో జైపుర్, జలంధర్, రాయ్పూర్, హైదరాబాద్, చెన్నై, పనాజీ ఉన్నాయి.
కొన్నింటికి ఉగ్ర సంస్థలతో సంబంధాలు
దాదాపు వెయ్యి డొల్ల కంపెనీలపై ఈడీ దృష్టి సారించి వివరాలు ఆరా తీసింది. వీటిలో కొన్ని సంస్థలకు ఉగ్రనిధులతోనూ సంబంధాలున్నాయని తేల్చింది. వ్యాపార స్వభావం, కంపెనీ ఆవిర్భావం నుంచి అనేక వివరాలను డొల్ల కంపెనీలు గోప్యంగా ఉంచుతున్నాయి.
గోప్యత, కూడబెట్టిన లబ్ధిదారులు ఎవరో చెప్పకపోవడం
డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడకు పంపిస్తున్నాయో చెప్పకుండా గోప్యత పాటించడం, అవినీతి ద్వారా కూడగట్టిన డబ్బుకు లబ్ధిదారులెవరో చెప్పకపోవడం వంటివి చోటు చేసుకున్నాయని ఈడీ సీనియర్ అధికారి ఒకరు తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి.