కేసీఆర్..జగన్ మధ్య గ్యాప్ మొదలైందా..! ఉమ్మడి డ్రీం ప్రాజెక్ట్ డ్రాప్: ఏపీ సీఎం సొంత అడుగులు..!
ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య అంతరం పెరుగుతోందా. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయం నుండి ఇద్దరూ ఒక్కటిగా వ్యవహరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరిస్తామని ప్రకటించారు. అనేక అంశాల్లో కలిసి మందుకెళ్లాలని నిర్ణయించిన ఇద్దరు ముఖ్యమంత్రులు అందులో భాగంగా రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగేలా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు రాష్ట్రాల అధికారులు అనేక ప్రణాళికలు వారిద్దరి ముందుంచారు.
దీని పైన ఏపీ సీఎం జగన్ పైన టీడీపీ నేతలు విమర్శలు చేసారు. ఏపీకి నష్టమని వాదించారు. కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాలంటూ జగన్ కు అనేక మంది సూచనలు చేసారు. ఆర్టీసీ సమ్మె నేపధ్యంలోనూ జగన్ నిర్ణయం మీద కేసీఆర్ ప్రతికూలంగా మాట్లాడారు. ఇక, జగన్ తాజాగా ఇరిగేషన్ సమీక్షలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ కు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇద్దరి ముఖ్యమంత్రుల డ్రీం ప్రాజెక్టు ఏమైంది..
ఏపీ ముఖ్యమంత్రి జగన్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు రెండు రాష్ట్రాల సమస్యల మీద పలుమార్లు భేటీ అయ్యారు. కేసీఆర్ మాటకు జగన్ గౌరవం ఇస్తూ వచ్చారు. తెలంగాణ లో ఎరువుల సమస్య పరిష్కారం కోసం ఎరువుల దిగుమతులకు ఏపీ పోర్టులు వినియోగించుకొనేందుకు అనుమతి ఇచ్చారు. కేసీఆర్ సిఫార్సు చేసిన వారికి జగన్ టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు. ఇక, రెండు రాష్ట్రాలకు ప్రయోజన కరంగా సముద్రంలో కలుస్తున్న గోదావరి నీటిని సద్వినియోగం చేసుకొనే విధంగా..తెలంగాణ..ఆంధ్ర భూ భాగాలను కలుపుతూ కొత్త ప్రాజెక్టుకు డిజైన్ చేసారు. దాదాపు లక్ష కోట్ల ఖర్చుతో దీనిని నిర్మించాలని ప్రాధమికంగా చర్చలు సాగాయి. దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు సూత్రప్రాయంగా అంగీకరించారు. కానీ, ఇప్పుడు అది నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక, ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపించటం లేదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

జగన్ తాజా నిర్ణయం ప్రకారం..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తెలంగాణతో సంబంధం లేకుండా గోదావరి - కృష్ణా అనుసంధానానికి ఒక ప్రణాళికపైన దిశా నిర్ధేశం చేసారు. దీని మేరకు
పోలవరం నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్కు గోదావరి జలాల తరలింపు దీని లక్ష్యం. రెండు ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తున్న వ్యాప్కోస్ ముఖ్యమంత్రితో ప్రయోజనాల మీద నివేదిక ఇచ్చింది. ఇందులో
గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీలతో భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీని ద్వారా లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. కరవు ప్రాంతాలకు సాగు.. తాగునీరు ఇచ్చేందుకు వెసులుబాటు కలుగుతుందని అంచనా వేసారు. ప్రాథమికంగా రూ.60 వేల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనాకు వచ్చారు. దీని ద్వారా ఇక, కేసీఆర్ తో కలిసి తెలంగాణ..ఏపీ భూభాగాల కోసం ఇద్దరు సీఎంలు గతంలో ప్రతిపాదించిన డ్రీం ప్రాజెక్టు పైన ముందుకు వెళ్లేది లేదని పరోక్ష సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

అసలు కారణం ఏంటి...
ఇప్పుడు ఏపీ సీఎం జగన్ గోదావరి జలాల విషయంలో సొంత నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలైంది. గతంలో అసెంబ్లీలోనూ కేసీఆర్ తో జరిగిన చర్చల సారాంశాన్ని జగన్ వివరించగా చంద్రబాబు వ్యతిరేకించారు. అదే విధంగా..భవిష్యత్ లో నష్టం చేస్తుందని వాదించారు. ఉండవల్లి లాంటి వారు సైతం కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇక, ఆర్టీసీ సమ్మె విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సైతం జగన్ కు ఇబ్బందిగా అనిపించినట్లు తెలుస్తోంది. తాను ఆర్టీసీ విలీనం దిశగా అడుగులు వేస్తుంటే..అది ఏపీలోనూ అమలు కాదనే విధంగా కేసీఆర్ వ్యాఖ్యానించటం జగన్ అభ్యంతరానికి కారణంగా తెలుస్తోంది. ఇక, దీని పైన ఏపీలోని అధికార పార్టీ నేతలవ్వరూ స్పందించలేదు. అదే సమయంలో జగన్ తాజాగా ప్రతిపాదించిన నదుల అనుసంధాన నూతన ప్రాజెక్టు ద్వారా..ఇక, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ మొదలైందా అనే చర్చ సైతం వినిపిస్తోంది. దీంతో...రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటువంటి సమీకరణాలకు కారణం అవుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications