3000కి.మీ కు చేరుకున్న జగన్ పాదయాత్ర...చలాకీ నడక వెనుక రహస్యం ఇదేనట!
Recommended Video

విజయనగరం:వైసిపి అధినేత,ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేటి చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం మూడు వేల కిలో మీటర్లకు చేరుకుంది. పాదయాత్ర ఆరంభించి 269 వరోజు ఆయన విజయనగరం జిల్లాలో ఈ మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోబోతున్నారు.
ఇడుపులపాయలో మొదలైన జగన్ ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాల్లో ముగిసి 12 వ జిల్లా విజయనగరంలో ప్రవేశించింది. జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద జగన్ ఈ 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించబోతున్నారు. ఇంతటి క్లిష్టమైన సుదీర్ఘ పాదయాత్రను వైసిపి అధినేత జగన్ సునాయాసంగా కొనసాగించడానికి కారణం ఆహారం, ఆరోగ్యం కోసం ఆయన తీసుకున్న జాగ్రత్తలేనని అనుచరులు అంటున్నారు. ఆ వివరాలు మీకోసం....

పాదయాత్ర...కొనసాగుతోంది ఇలా
వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేపట్టి నేటికి 269 రోజులు. ప్రజాసంకల్పయాత్ర పేరిట నవంబర్ 6, 2017న ఇడుపులపాయ నుంచి ప్రారంభించి ఇచ్ఛాపురం వరకూ సుమారు 3000 కిలో మీటర్ల పాదయాత్ర జరపాలని జగన్ లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో జగన్ పాదయాత్ర 11 జిల్లాల్లో ముగిసి 269 వ రోజు సోమవారం 12 వ జిల్లా విజయనగరంలో ప్రవేశించింది. జగన్ పాదయాత్ర ఈరోజే విజయనగరం జిల్లాలో ప్రవేశించినందున ఈ జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఆయన పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే ఇలా రెండు జిల్లాలు ఉండగానే జగన్ 3000 కి.మీ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.

జగన్...దినచర్య ఇదే
పాదయాత్ర ప్రారంభించి 269 రోజులు అవుతున్నా జగన్ దినచర్యలో ఏ ఒక్కరోజూ ఏ మార్పు ఉండదని ఆయన అనుచరులు స్పష్టం చేస్తున్నారు. వివిధ కారణాల రీత్యా రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా...ఉదయం మాత్రం తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్ర లేస్తారని...లేవడంతోనే గంట పాటు వ్యాయామం...కాలకృత్యాలు ...అనంతరం ఆరున్నర...ఏడు గంటల వరకు పత్రికల పఠనం...చేస్తారని చెప్పారు. ఆ తర్వాత పార్టీ విషయమై ముఖ్యులతో ఫోన్ సంభాషణ ఉంటుందని తెలిపారు.

పాదయాత్ర...ప్రారంభం ఇలా
అనంతరం ఉదయం ఏడు...ఏడున్నర గంటలకు పార్టీ ప్రముఖులు, ఇతర ముఖ్యులతో ప్రత్యక్ష భేటీలు ఉంటాయని చెప్పారు. ఆ తరువాత ఆ రోజు సాగే పాదయాత్ర మార్గాన్ని, ఏ గంటకు ఎక్కడ ఉండాలనేది, ఆనాటి పాదయాత్రలో భాగమయ్యే ఇతర ముఖ్యాంశాలు, విశేషాలు అడిగి తెలుసుకుంటారట. షెడ్యూల్ ప్రకారం పాదయాత్రను ప్రారంభించడంలో ఆయనకు ఆయనే సాటి అని...రోజూ తెల్లటి చొక్కా, క్రీమ్ కలర్ ఫ్యాంట్, కాళ్లకు బూట్లు ఇవే ఆయన ఆహార్యమని తెలిపారు.
ఆహారం...రహస్యాలు
జగన్ ఉదయం ఏ టిఫిన్ తినకుండా కేవలం గ్లాస్ జ్యూస్ తాగి తన యాత్రను ప్రారంభిస్తారట. మధ్యాహ్నం ఆయన కేవలం కొన్ని పండ్లు, కప్పు పెరుగు మాత్రమే ఆహారంగా తీసుకుంటారట. రాత్రి పూట ఆహారాన్ని కేవలం ఒకటీ రెండు పుల్కాలు, పప్పు, మరో కూరతో ముగిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు కప్పు పాలు తాగుతారు. ఇప్పటి వరకూ ఇదే ఆయన దినచర్య అని అనుచరులు వివరించారు. ఇలా మితాహారం, అధిక వ్యాయామంతోనే ఆయన రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జనంతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారని వారు చెబుతున్నారు.
3000కి.మీ చేరిక...ఎక్కడంటే
జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలోని దేశపాత్రునిపాలెం గ్రామానికి చేరుకునేప్పటికి 3000 కిలో మీటర్ల మైలురాయి చేరుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ పైలాన్ను ఆవిష్కరించనున్నట్టు ఆయన వెల్లడించారు. జగన్ పాదయాత్ర ఇప్పటివరకు 116 నియోజకవర్గాల్లోని 193 మండలాల్లో...1650 గ్రామాల మీదుగా సాగిందని, అదేవిధంగా 44 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్ల పరిధిలో పాదయాత్ర జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు పాదయాత్రలో భాగంగా 106 సభలు, 41 ఇంట్రాక్షన్లు జరిగాయని వివరించారు. దేశపాత్రునిపాలెంలో 107వ బహిరంగ సభ జరగనుందని చెప్పారు. 269 రోజులుగా సాగుతున్న జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications