సీఎం జిల్లాలో కాబట్టి: జగన్ యాత్రపై విజయసాయి, ఫస్ట్ తెలుసుకో.. పరిటాల సునీత ఆగ్రహం
అనంతపురం/చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి ఉదయం యాత్ర ప్రారంభించారు. తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామంలో చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు.
అనంతరం ఆయన తన పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఆయన అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. అక్రమాస్తుల కేసులో ఆయన శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

ఏర్పాట్లు చూసిన విజయసాయి
రానున్న సాధారణ ఎన్నికల్లో వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని వైసీపీ నేత, ఎంపి విజయసాయి రెడ్డి వేరుగా అన్నారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో జగన్ పాదయాత్ర నేపథ్యంలో విజయసాయి అంతకుముందు రోజు ఏర్పాట్లను పరిశీలించారు. చంద్రబాబు సొంత జిల్లాలో కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.

జగన్ పాదయాత్ర చరిత్ర సృష్టించాలి
జగన్ పాదయాత్రతో టీడీపీకి వణుకు పుట్టాలన్నారు. పాదయాత్ర చరిత్ర సృష్టించాలని, ప్రజలు తమ కష్టనష్టాలను జగన్తో చెప్పుకోవచ్చునని విజయసాయి అన్నారు. నాడు ప్రజా ప్రస్థానంతో వైయస్ రాజశేఖర రెడ్డి ట్రెండ్ సెట్ చేశారని, ఇప్పుడు జగన్ ప్రజా సంకల్ప యాత్రతో సరికొత్త ట్రెండ్ సృష్టించి మరో వైయస్సార్ కాబోతున్నారన్నారు.

జగన్ ఆగ్రహం
అంతకుముందు, అనంతపురం జిల్లాలో జగన్ టీడీపీపై నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కొత్తగా కట్టలేదని, వైయస్ హయాంలో 90 శాతం పూర్తి చేసినవే అన్నారు. వాటిని తానే కట్టానని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. డ్వాక్రా మహిళల వడ్డీలను మాఫీ చేయలేదని మండిపడ్డారు.

జగన్ వాస్తవాలు గుర్తించు
డ్వాక్రా సంఘాల రుణమాఫీపై జగన్ విమర్శలు చేయడంపై మంత్రి సునీత స్పందించారు. డ్వాక్రా సంఘాలకు అత్యధిక మొత్తంలో వడ్డీ రాయితీ ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. టీడీపీ వచ్చాక డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ ఎత్తివేశారని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అనేక రాయితీలు కల్పించారని జగన్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. 2004 నుంచి 2013 మధ్య రూ.2,306 కోట్లు వడ్డీ రాయితీ అందించారని, 2014 నుంచి రూ.2,512 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఇందులో రూ.1,842 కోట్లు సంఘాలకు అందించామన్నారు. ఇప్పటికైనా జగన్ వాస్తవాలు గుర్తించాలన్నారు.












Click it and Unblock the Notifications