జమిలికి కౌంట్డౌన్: ప్రతి బుధ, గురు అక్కడే బస: జగన్..!!
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతోన్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండగ తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో విస్తృతంగా పర్యటించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో..
ఈ సాయంత్రం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.

రెడ్బుడ్ రాజ్యాంగం..
రాష్ట్రంలో రెడ్బుడ్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వ్యవస్ధలన్నీ కూప్పకూలిపోయాయని, ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా కేసులు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి మంచి చేయకపోవడం వల్లే ప్రభుత్వ పెద్దలు జనంలోకి వెళ్లలేకపోతోన్నారని విమర్శించారు.
తేడాలను స్పష్టంగా గమనిస్తోన్నారు..
తమ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వం మధ్య ప్రజలు తేడాలను స్పష్టంగా గమనిస్తోన్నారని, ప్రతి ఇంట్లో కూడా పోలిక మొదలైందని జగన్ చెప్పారు. తమ పాలన ఎలా ఉండేది.. ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేస్తోందనే చర్చ ప్రతి ఇంట్లో నడుస్తోందని పేర్కొన్నారు.
ప్రలోభపెట్టి చంద్రబాబు అధికారంలోకి..
తాము ప్రజలకు చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదని, అందుకే ప్రతి ఇంటికి, గడప గడపకూ వెళ్లినప్పుడు చిరునవ్వుతో ప్రజలు అక్కున చేర్చుకుంటోన్నారని జగన్ చెప్పారు. ప్రజలను ప్రలోభపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని, ఆ తరువాత సూపర్ సిక్స్ హామీలను బుట్టదాఖలు చేశాడని విమర్శించారు.
10 శాతం ఓటు బ్యాంకు తగ్గింది..
తాను ఇచ్చినవన్నీ కూడా సాధ్యం కాని హామీలని, అవి సాధ్యం కావని తెలిసినా చంద్రబాబు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాడని జగన్ అన్నారు. దీనివల్ల చంద్రబాబు కూడా బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తాడేమోననే ఆశ ప్రజలకు కలిగిందిని, ఫలితంగా 10 శాతం ఓటు బ్యాంకు తగ్గిందని వివరించారు.
విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితి..
ఫీజులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే 2,800 కోట్ల రూపాయలకు చేరిందని జగన్ తెలిపారు. తమమ హయాంలో ప్రతి ఏప్రిల్లో వసతి దీవెనకు 1,100 కోట్లు రూపాయలను ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు.
రూ.3,900 కోట్లు బకాయిలు
తల్లికి వందనం, వసతి దీవెన కింద దాదాపు రూ.3,900 కోట్లు పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయని జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీకి సంబందించిన మార్చి నుంచి నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.2,200 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కాలంటే, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జమిలికి..
ఈ సందర్భంగా జగన్ జమిలి ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇన్ని అబద్దాలు ఆడి, ఇన్ని మోసాలు చేసిన టీడీపీ కూటమి పరిస్థితి జిమిలి ఎన్నికల్లో ఎలా ఉంటుందన్నది తాను చెప్పాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు.
మూడేళ్లైనా, రెండేళ్లైనా..
ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు అది మూడేళ్లైనా, రెండేళ్లైనా తాను కోరేది ఒక్కటేనని, పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమ సన్నగిల్లకూడదని జగనన్ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందువల్ల కష్ట, నష్టాలు ఉంటాయని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండబోమని పేర్కొన్నారు.
16 నెలలు జైలులో పెట్టారు..
కష్టాలు రాకుండా పోవని, తనను 16 నెలలు జైలులో పెట్టారని జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్తో యుద్ధం చేశానని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, కాంగ్రెస్.. రెండూ కలిసి తనపై పిటిషన్లు వేశాయని, ఇంత మందితో యుద్ధం చేస్తున్నానని అన్నారు.

సంక్రాంతి తరువాత..
సంక్రాంతి తరువాత తాను కూడా పార్లమెంట్ యూనిట్గా జిల్లాల బాట పడతానని జగన్ వివరించారు. జనవరి నెలాఖరు నుంచి ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటాననని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని అక్కడే బస చేస్తానని తెలిపారు. బుధవారం నాడు మూడు, గురువారం నాడు నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతోనూ మమేకం అవుతానని చెప్పారు.
కార్యకర్తలతో జగనన్న
పూర్తి సమయం కార్యకర్తలకే కేటాయిస్తానని, నియోజకవర్గాల్లోనే అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, తోడుగా ఉంటానని, కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే పేరుతో జిల్లాల పర్యటనలను నిర్వహిస్తానని జగన్ స్పష్టం చేశారు.
గ్రామస్ధాయి వరకు పార్టీ బలోపేతం..
మండలం నుంచి గ్రామస్ధాయి వరకు పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. బూత్ల నుంచి గ్రామ కమిటీలను నియమిస్తానని, గ్రామస్ధాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఒక ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సప్ ఉండాలని, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలని, యూట్యూబ్లో పోస్ట్ చేయాలని చెప్పారు.
ప్రతి ఇళ్లూ ప్రశ్నించేలా..
సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇళ్లూ ప్రశ్నించేలా చేయాలని జగన్ సూచించారు. సూపర్ సిక్స్, స్కూల్, హాస్పిటల్, పంటల కొనుగోలు, ఆర్బీకేలు ఏమయ్యాయనే ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి వినిపించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications