సచివాలయ మహిళా కార్యదర్శులకు హైకోర్టులో ఊరట-జగన్ సర్కార్ కీలక హామీ
ఏపీలో సచివాలయ మహిళా సంక్షేమ కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ హైకోర్టులో ప్రభుత్వం ఇవాళ కీలక హామీ ఇచ్చింది. రాష్ట్రంలో మహిళా పోలీసుల విధి నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో హైకోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. దీంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో గ్రామ సచివాలయాల సిబ్బందికి పోలీస్ విధులు కేటాయించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. వారికి పోలీసు విధులు ఎలా కేటాయిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో వారికి పోలీస్ విధులు ఇవ్వబోమని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. మహిళా పోలీసుల విషయంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు హైకోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉందని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
వాస్తవానికి రాష్ట్రంలో స్త్రీ సంక్షేమ శాఖతో పాటు పోలీస్ శాఖ సంయుక్తంగా మహిళా పోలీసుల్ని పర్యవేక్షిస్తున్నారని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్లు దీనిపై అభ్యంతరం తెలిపారు. మహిళా పోలీసులకు నైట్ డ్యూటీలు వేస్తున్నారని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారని వారి తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపాకరు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. వారికి నైట్, పోలీస్ డ్యూటీలు ఎలా వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఇకపై వారికి రాత్రి డ్యూటీలతో పాటు పోలీసు డ్యూటీలు కూడా వేయబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు.