జగన్ సర్కార్ కు తలనొప్పిగా రోడ్ల వ్యవహారం-కాంట్రాక్టర్ల సహాయనిరాకరణ-విపక్షాలకు టార్గెట్
ఏపీలో దెబ్బితిన్న రహదారుల పునరుద్ధరణ వైసీపీ సర్కార్ కు ఎన్నడూ లేనంత తలనొప్పిగా మారిపోతోంది. గత ప్రభుత్వాల హయాంలో దెబ్బతిన్న రోడ్ల కోసం కాస్తో కూస్తో కేటాయింపులు జరిగేవి. వీటితో రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు అయినా చేసే వారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో రోడ్లను పట్టించుకున్న నాథుడు లేడు. దీంతో అవి నానాటికీ తీసికట్టుగా మారిపోయాయి. రోడ్లు వేయిద్దామంటే కాంట్రాక్టర్లు సహకరించడం లేదు, అలాగని మౌనంగా ఉందామంటే విపక్షాలు ఊరుకోవడం లేదు. దీంతో వైసీపీ సర్కార్ పరిస్ధితి ముందునుయ్యి, వెనుక గొయ్యిగా మారిపోతోంది.

ఏపీలో ఛిద్రమైన రహదారులు
ఏపీలో రోడ్లు వేసి చాలా కాలమైంది. ప్రభుత్వాలు మారుతున్నా రోడ్లు వేసే పరిస్దితి కనిపించడం లేదు. ఒకప్పుడు రోడ్ల నిర్మాణం, రిపేర్లకు ప్రతీ ఏటా నిధుల కేటాయింపు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. దీంతో రోడ్ల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది. అభివృద్ధి మాట దెవుడెరుగు కనీసం రోడ్లు వేస్తే చాలన్న పరిస్ధితులు దాపురించాయి. దీంతో రాష్ట్రంలోని వేలాది కిలోమీటర్ల రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. వీటిని ఎప్పుడు రిపేర్ చేస్తారో తెలియదు, ఎప్పుడు కొత్తగా నిర్మిస్తారో తెలియదు. అడిగితే చెప్పే నాథుడు లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నరకానికి కేరాఫ్ అడ్రస్ లు
రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినడంతో ప్రతి నిత్యం వీటిపై ప్రయాణించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే ప్రజలు మృత్యువాత పడుతున్నారు. వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వీటిని రిపేర్లు చేయించుకునేందుకు ప్రజలు మళ్లీ వేల రూపాయలు ఖర్చుపెట్టుకోవాల్సిన పరిస్దితి. రహదారులపై ప్రమాదాలకు అయితే ఇక లెక్కే లేదు. నిత్యం వీటిపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ప్రభుత్వానికి మాత్రం రోడ్ల సంగతి పట్టడం లేదు.

పన్నులిచ్చి మరీ చెత్త రోడ్లపై ప్రయాణం
ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణించే వారికి వారు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించినప్పుడు లీటరుకు రెండు రూపాయల చొప్పిన రోడ్ సెస్ గా వసూలు చేస్తోంది. దీన్ని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్ధకు మళ్లిస్తోంది. అయితే అప్పటికే ఈ సంస్ధ పేరుతో తెచ్చిన అప్పుకు వడ్డీగా ఏడాదికి 450 కోట్లు చెల్లిస్తోంది. దీంతో సెస్ ద్వారా వచ్చే 600 కోట్లలో 450 కోట్లు అప్పులపై వడ్డీకే కట్టాల్సిన పరిస్ధితి. దీంతో మిగిలిన 150 కోట్లతో రోడ్లు రిపేర్లు చేద్దామన్నా ఒక్క జిల్లాకు కూజా సరిపోయేలా లేవు. దీంతో ప్రజలు పన్నులు కట్టి మరీ చెత్త రోడ్లపై ప్రయాణాలు చేసి ప్రాణాలు కోల్పోతున్న పరిస్ధితి. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.

కాంట్రాక్టర్ల సహాయనిరాకరణ
రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులే ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో అప్పుడు పనులు చేసి వారే ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినా వారిని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రోడ్ల రిపేర్ల పనుల్ని సైతం వారికే అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పనులు చేస్తే ఆ బిల్లులు విడుదల చేస్తామని కూడా చెబుతోంది. అయినా వారు ఎక్కడా ముందుకు రావడం లేదు. ప్రభుత్వాన్ని నమ్మి మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని వారు తేల్చిచెప్పేస్తున్నారు. రోడ్ల రిపేర్ల కోసం టెండర్లు పిలిస్తే కనీస స్పందన కూడా ఉండడం లేదు. దీంతో ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు.

వైసీపీతో ఆడుకుంటున్న విపక్షాలు
ఏపీలో రోడ్ల పరిస్దితి నానాటికీ తీసికట్టుగా మారుతుండటం, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, కాంట్రాక్టర్ల సహాయ నిరాకరణతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కార్ పై విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. రోడ్ల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ సర్కార్ పై పోరుబాట పట్టాయి. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కనిపించిన రోడ్లన్నీ ఫొటోలు తీసి పెడితే 6 లక్షల ట్వీట్లు వచ్చాయి. అంటే రోడ్లపై జనాగ్రహం ఎలా ఉందో దీన్ని బట్టి అర్ధమవుతోంది. టీడీపీ కూడా ఎక్కడ కనిపిస్తే అక్కడ రోడ్ల వ్యవహారాన్ని హైలెట్ చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఎన్నడూ లేనంత దారుణంగా ఇరుకునపడుతోంది.

జగన్ ఏం చేస్తారో మరి ?
ఏపీలో రోడ్ల పరిస్ధితి దారుణంగా తయారైంది. కాంట్రాక్టర్లు సహకరించే పరిస్ధితి లేదు. హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలవుతున్నాయి. మరోవైపు విపక్షాలు ప్రజల్లోకి ఈ సమస్యను బలంగా తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్, సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే రోడ్ల రిపేర్ల కోసం రూ.2 వేల కోట్లు బ్యాంకుల నుంచి తీసుకునేందుకు రహదారుల అభివృద్ధి సంస్ధకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది.
అయినా డబ్బులు సమీకరించలేని పరిస్ధితి. క్షేత్రస్ధాయిలో పరిస్ధితి చూశాక బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు సైతం ముందుకు రావడం లేదు. సొంత డబ్బులు పెట్టి ఇప్పట్లో రోడ్లు రిపేర్లు చేయించే పరిస్దితి లేదు. అసలే సంక్షేమ జాతర కొనసాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో సీఎం జగన్ రోడ్లపై తీసుకునే నిర్ణయాల కోసం ప్రజలు, విపక్షాల కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఎదురుచూస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications