కుప్పంలో రెండోరోజు చంద్రబాబు టూర్-అమరావతిలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు..!
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తాజా టూర్లు కలకలం రేపుతున్నాయి. కందుకూరు, గుంటూరులో చంద్రబాబు పర్యటనల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసటాల నేపథ్యంలో రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆయన్ను కుప్పంలోనూ అడుగడుగునా అడ్డుకుంటోంది. అదే సమయంలో అమరావతిలోనూ టీడీపీ సీనియర్ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
కుప్పంలో నిన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య రోడ్ షోలకు బదులు పాదయాత్రతో పర్యటన కొనసాగించిన చంద్రబాబు.. ఇవాళ రెండోరోజు స్ధానిక టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. ఇవాళ కూడా తన షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో కుప్పంలో ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా లేవు. కుప్పంలో నిన్న చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా చంద్రబాబు మాత్రం స్ధానికంగా పర్యటిస్తూనే ఉన్నారు.
మరోవైపు చంద్రబాబు కుప్పం టూర్ నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు అమరావతినీ తాకాయి. విజయవాడ, గుంటూరులోని పలువురు టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రుల ఇళ్ల వద్ద రాత్రి నుంచి బందోబస్తు పెంచిన పోలీసులు.. ఇవాళ వారిని బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇళ్లలోనే హౌస్ అరెస్టు చేశారు. కారణాలు సైతం చెప్పకుండా వారిని ఇళ్లలోనే ఉంచేశారు. దీంతో ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, దేవినేని ఉమ వంటి టీడీపీ సీనియర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.