ఆస్తిపన్ను కట్టలేదా ? జప్తుకు ఆస్తులు రెడీ చేసుకోండిక !కాకినాడలో రంగంలోకి వాహనాలు
ఏపీలో ప్రభుత్వం గతేడాది ఆస్తిపన్ను 15 శాతం మేర పెంచింది. గతంలో ఉన్న అద్దె ఆధారిత విలువ స్ధానంలో రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్ను బాదుడు మొదలుపెట్టింది. పెరిగిన పన్నులతో జనం లబోదిబోమంటున్నారు. చాలా చోట్ల కట్టేందుకు సైతం నిరాకరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వారితో ఎలాగైనా కట్టించేందుకు కొత్త వ్యూహం అమలు చేయడం మొదలుపెట్టంది. ఇందులో భాగంగా కాకినాడ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లో ఈ పథకానికి తెరదీసింది.
ఆస్తిపన్ను కట్టకపోతే
ఏపీలో ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తిపన్ను చెల్లించకపోతే సదరు అసెస్సీల ఆస్తుల్ని జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఆస్తిపన్ను వసూళ్లు అనుకున్నంతగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిబంధనకు దుమ్ముదులుపుతోంది. పన్ను కట్టని వారి ఆస్తుల్ని జప్తు చేసేందుకు కొత్తదారులు వెతుకుతోంది. ఇప్పటికే పన్ను వసూళ్ల సిబ్బందిని ఇంటింటికీ పంపి పన్ను కట్టనివారిపై బెదిరింపులకు దిగుతోంది.సంక్షేమ పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తోంది. అదీ చాలదన్నట్లు ఇప్పుడు మరో కొత్త ప్లాన్ అమలు చేస్తోంది.
ఆస్తుల జప్తుకు కొత్త వాహనాలు
పన్ను కట్టని వారి సంఖ్య ఒకటీ అరా ఉంటే దాని గురించి ప్రభుత్వానికి ఎలాంటి బెంగా లేదు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య భారీగా ఉంటుండటంతో ప్రభుత్వం కొత్త వ్యూహానికి తెరదీస్తోంది. ఇందులో భాగంగా ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తుల జప్తు కోసం ప్రత్యేకంగా వాహనాలను రంగంలోకి దింపుతోంది. కాకినాడ కార్పోరేషన్ లో తొలిసారిగా ఈ కొత్త వాహనాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులు బెంబేలెత్తుతున్నారు. పన్ను చెల్లించకపోతే మరిన్ని కష్టాలు తప్పవని అధికారులు వారిని హెచ్చరిస్తున్నారు.
కాకినాడతో మొదలు
రాష్ట్రంలోని స్మార్ట్ సిటీల్లో ఒకటైన కాకినాడలో తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లకు ప్రభుత్వం కొత్త వాహనాలను రంగంలోకి దింపుతోంది. ఆస్తిపన్ను కట్టని వారి ఆస్తుల్ని, సామానుల్ని జప్తు చేసే వాహనాలని పేరు పెట్టి మరీ దీన్ని సిటీలో తిప్పుతున్నారు. వీటిని చూసిన వారు ఆస్తిపన్ను కట్టకపోతే ఈ వాహనాల్లో మున్సిపల్ సిబ్బంది వచ్చి తమ సామాన్లు జప్తు చేస్తారని భయపడుతున్నారు. కొందరైతే పెండింగ్ లో ఉన్న బకాయిలు కట్టడం మొదలుపెట్టేసినట్లు సమాచారం. మిగతా వారిని కూడా ఈ వాహనాల ద్వారా భయపెట్టి ఎలాగైనా పన్ను వసూలు చేసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మరోవైపు కాకినాడతో మొదలైన ఈ జప్తు వాహనాల పర్వం త్వరలో మిగతా కార్పేరేషన్లకు, ఆ తర్వాత మున్సిపాలిటీలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి.