ఏపీలో పెన్షన్ దారులకు ఊరట ! గతంలో తీసేసిన ఆ స్కీమ్ మళ్లీ ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో లబ్దిదారుల్లో అసంతృప్తిని గుర్తించి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జగనన్న సురక్ష పేరుతో సర్వే నిర్వహిస్తూ అర్హులైన లబ్దిదారుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఇప్పటికే ఉన్న లబ్దిదారుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు కొత్త ఆలోచనలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో తీసేసిన ఓ పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒకే ఇంట్లో ఒకరికి మించి పెన్షన్ దారులు ఉండేవారు. ఒకరికి ఆసరా కింద వృద్ధాప్య పింఛన్ వస్తుంటే మరొకరికి వితంతు పెన్షన్ లేదా ఒంటరి మహిళ పెన్షన్ వచ్చేది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇలాంటి వారిని గుర్తించి అనర్హులుగా ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి ఇంటికో పెన్షన్ మాత్రమే అమలవుతోంది. కానీ ఎన్నికల ఏడాది లబ్దిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్లు, అర్హులైన వారికి పథకాలు నిరాకరించకూడదన్న లక్ష్యంతో తిరిగి ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో చేస్తున్న జగనన్న సురక్ష పథకం సర్వే కింద ఇంటింటికీ తిరుగుతున్న వాలంటీర్లు.. ఏయే ఇళ్లలో రెండో పెన్షన్ ఇవ్వదగిన లబ్దిదారులు ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నారు. గతంలో అర్హత ఉండి పెన్షన్ తీసుకుని ఉన్న వారు, ఆ తర్వాత తొలగించిన వారిని గుర్తిస్తున్నారు. వీరికి మళ్లీ పెన్షన్ పునరుద్ధరించే అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి ? వారు ఇప్పటికీ సదరు పెన్షన్లకు అర్హులేనా అన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
జగనన్న సురక్ష సర్వే పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఇంట్లో రెండో పెన్షన్ పై సేకరించిన గణాంకాల ఆధారంగా తిరిగి ఆ పథకాన్ని పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య భారీగా ఉంటే తప్ప తిరిగి ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారి కుటుంబ సభ్యులైన లబ్దిదారుల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications