మూడు రాజధానుల బిల్లుకు బ్రేక్ ? హైకోర్టు తీర్పు ప్రభావం-సుప్రీంకు వెళ్లే ఛాన్స్
ఏపీలో అమరావతిని రాజధానిగా చేస్తూ గతంలో టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీఆర్డీయే చట్టం అమలు చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రణాళికపై ప్రభావం చూపబోతోంది. ఈ నెల 7 న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల కొత్త బిల్లు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. దీంతో వైసీపీ సర్కార్ బిల్లును ఆలస్యం చేసి ప్రత్యామ్నాయాల వేట ప్రారంభించబోతోంది.
అమరావతిపై హైకోర్టు తీర్పు
ఏపీ రాజధానిగా గతంలో ఎంపిక చేసిన అమరావతికి ప్రత్యామ్నాయంగా వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల్ని తప్పుబడుతూ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. గతంలో తీసుకొచ్చిన సీఆర్డీయే చట్టాన్ని అమలు చేయాల్సిందేనని, రైతులకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాజధాని మార్పుకూ వీల్లేకుండా పోయింది. ఈ తీర్పు ప్రభావం వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల కొత్త బిల్లుపై పడబోతోంది. దీంతో ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై మల్లగుల్లాలు పడుతోంది.
మూడు రాజధానుల కొత్త బిల్లుకు బ్రేక్ ?
మూడు రాజధానులపై గతంలో తెచ్చిన రెండు బిల్లుల్ని ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో, మండలిలో వెనక్కి తీసుకుంది. ఇప్పుడు వాటి స్ధానంలో మరింత మెరుగైన ఒకే బిల్లును తెస్తామని గతంలోనే చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు తెస్తామని మంత్రులు ఇప్పటికీ చెప్తున్నారు. కానీ హైకోర్టు తీర్పుతో వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ఏర్పాటు కాకుండా హైకోర్టు తీర్పు బ్రేక్ వేసింది. దీంతో మూడు రాజధానులపై కొత్త బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ సర్కార్ కు వీల్లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుపై తాత్కాలికంగా వెనక్కి తగ్గే అవకాశముంది.
సుప్రీంను ఆశ్రయించే ఛాన్స్
సీఆర్డీయే చట్టం ప్రకారం అమల్లోకి వచ్చిన అమరావతి రాజధాని స్దానంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వీల్లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ప్రభుత్వం పునరాలోచన చేయక తప్పని పరిస్దితి ఎదురవుతోంది. అందుకే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసే విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఈ మేరకు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో పాటు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించినా అక్కడ వెంటనే తీర్పు వస్తుందన్న గ్యారంటీ లేదు. దీంతో అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు వీల్లేకుండా పోతుందని భావిస్తున్నారు.
ఎదురుతన్నిన వ్యూహాలు ?
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు అమరావతికి మద్దతిచ్చినట్లు చెప్పుకుని, అధికారంలోకి వచ్చాక అందుకు వ్యతిరేకంగా మూడు రాజధానులకు పావులు కదిపిన వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టుగా మారింది. ముఖ్యంగా అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని ఎవరూ ఆపలేరంటూ నిత్యం ప్రకటనలు చేసిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలకు హైకోర్టు తీర్పు భారీ షాకిచ్చింది. దీంతో ఇప్పుడు హైకోర్టు తీర్పులో చెప్పిన అంశాల్ని తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే బీజేపీ అమరావతికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకోవడం, మూడు రాజధానులపై కేంద్రం సహకరించకపోవడం, నిన్న కేంద్ర బడ్జెట్ లో అమరావతిలో నిర్మాణాలకు నిధులు కేటాయించడం చూస్తుంటే జగన్ వ్యూహాలన్నీ ఎదురుతన్నినట్లు అర్ధమవుతోంది.