టెన్త్ పేపర్ల లీకుల వెనుక షాకింగ్ రీజన్ -కొంపముంచిన టార్గెట్లు ! టీచర్ల అరెస్టులతో కలకలం
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అభాసుపాలవుతోంది. విపక్షాల విమర్శలు, తల్లితండ్రుల ఆందోళనతో అప్రమత్తమైన సర్కార్ వరుసగా ఇందుకు బాధ్యులైన టీచర్లను అరెస్టులు చేస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదు చేస్తోంది. దీంతో విద్యాశాఖతో పాటు విద్యార్ధులు, ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర కలకలం రేగుతోంది. అయితే ఇందుకు దారితీస్తున్న అసలు కారణాల్ని చూస్తే షాకవ్వాల్సిందే.
టెన్త్ పేపర్ల లీకులు, మాస్ కాపీయింగ్
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకులు తీవ్ర కలకలం రేపాయి. తొలిరోజు ప్రశ్నాపత్రం లీకయితే అది మాస్ కాపీయింగ్ మాత్రమేనని చెప్పుకున్న ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపించింది. కానీ రెండోరోజు ప్రశ్నాపత్రం కూడా లీకైంది. చివరికి మూడు, నాలుగు రోజుల ప్రశ్నాపత్రాలు కూడా లీకులు కావడం, మాస్ కాపీయింగ్ జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు ఇన్ని లీకులు, మాస్ కాపీయింగ్స్ మధ్య తాము రాసిన పరీక్షలు ఫలితాల దాకా వస్తాయా లేక రద్దవుతాయా అన్న ఆందోళన విద్యార్ధుల్లో కనిపిస్తోంది.
టీచర్ల వరుస అరెస్టులు
పదో తరగతి పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో టీచర్లను అరెస్టులు చేస్తోంది. టీచర్లతో పాటు ఇతర సిబ్బంది, ప్రైవేటు వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో అసలే పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్లపై టీచర్లు ఉద్యమిస్తున్న వేళ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల్లో లీకులు, మాస్ కాపీయింగ్స్ కు బాధ్యుల్ని చేస్తూ వరుస అరెస్టులు చేస్తుండటంతో ఏం జరుగుతోందన్న చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
జగన్ సర్కార్ టార్గెట్లే కారణమా ?
ఏపీలో విద్యారంగంలో వైసీపీ సర్కార్ పెను మార్పులు తెస్తోంది. నాడు-నేడు, అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అదే సమయంలో ఫలితాలు రావాల్సిందేనని విద్యావ్యవస్ధలో భాగమైన అధికారులు, టీచర్లకు టార్గెట్లు కూడా పెడుతోంది. ప్రైవేటు, కార్పోరేట్ సంస్ధల తరహాలో పెడుతున్న ఈ టార్గెట్లే చివరికి పదో తరగతి పరీక్షల్లో లీకులు, మాస్ కాపీయింగ్స్ కు కారణమవుతున్నాయా అన్న చర్చ మొదలైంది. తాజాగా అరెస్టైన టీచర్ల విచారణలో ఇదే విషయం తేలినట్లు ప్రచారం జరుగుతోంది. తమకు విధించిన భారీ టార్గెట్లను అందుకునే క్రమంలో టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారా అన్న చర్చ మొదలైంది. ఇదే వారిపై ఒత్తిడి పెంచి తప్పులు చేయిస్తోందన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం వ్యవస్ధాగత మార్పులు చేయకుండా టీచర్లకు టార్గెట్లు పెట్టడం సరికాదనే వాదన సర్వత్రా వినవస్తోంది.