మంత్రి రోజాను పదవి నుంచి తొలగించిన జగన్?
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇప్పటివరకు ఆమే కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవి నుంచి రోజాను తప్పించారు. ఎమ్మెల్సీ పోతుల సునీతకు ఆ బాధ్యతను అప్పగించారు.
జులై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ జరగబోతున్న సందర్భంగా వైసీపీలో సంస్థాగతంగా మార్పులు, చేర్పులు చేపట్టారు. పార్టీ అనుబంధ సంఘాల కొత్త అధ్యక్షులను నూతన ఇన్ఛార్జి విజయసాయిరెడ్డి ప్రకటించారు. రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పార్టీ పరంగా పదవి ఖాళీగా ఉంది. రెండింటినీ సమన్వయం చేయడం కుదరడంలేదు. దీంతో వేరేవారికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో పోతుల సునీతకు అప్పగించినట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రోజా మంత్రిగా, పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని వ్యవస్థాగతంగా సమూలమైన మార్పులు చేయాలని, వీరంతా రాబోయే ఎన్నికల్లో పార్టీకి తరుపుముక్కలుగా ఉపయోగపడాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని సాయిరెడ్డి వెల్లడించారు.

ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కీలక పదవులను భర్తీ చేశారు. వీటిని ప్లీనరీ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న బైరెడ్డికి ఈ పదవి సముచితమైనదేనని, భవిష్యత్తులో ఆయన సమున్నతమైన నేతగా ఎదగడానికి అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications