వైసిపికి మద్దతుగా ఎంఐఎం: అసద్ తో కీలక భేటీ: ఇక రంగంలోకి..!
తెలంగాణ ఎన్నికల అనంతరం ప్రకటించిన విధంగానే..ఎంఐఎం అధినేత అసద్ అడుగులు వేస్తున్నారు. ఏపి లో చంద్రబాబు ను ఓడిస్తామని అప్పుడు అసద్ ప్రకటించారు. దీనిలో భాగంగానే..చంద్రబాబు రాజకీయ ప్రత్యర్ధి జగన్ కు మద్దతుగా అసద్ ఏపి రాజకీయాల్లోకి ఎంట్రీ సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. స్పష్టమైన కార్యాచరణ సిద్దం అవుతోందని సమాచారం. అసద్ తో జరిగిన కీలక భేటీ ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది..
ఏపి మీద దృష్టి సారించారా..
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. ఏపిలో ఎన్నికల సందడి మొదలైంది. ఏపిలో కొద్ది రోజులుగా కేసీఆర్ పైనే చర్చ సాగుతూ తుంది. ఇక, ఇప్పుడు ఎంఐఎం అధినేత అసద్ రాజకీయ కార్యాచరణ పై అందరి దృష్టి నెలకొంది. ఏపిలో రాజకీయంగా ఎంఐఎం ఏ మేర ప్రభావం చూపిస్తుందో కానీ, వైసిపి అభిమానుల్లో మాత్రం తమకు మద్దుత పెరుగుతుం దనే అభిప్రాయం పెరుగుతోంది. ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచే పార్టీగా పేరున్న ఎంఐఎం ఓపెన్ గా జగన్ కు మద్దతు ఇస్తే..ఖచ్చితంగా అది మైనార్టీ ఓట్ల పై ప్రభావం చూపిస్తుందనే అంచానలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో మైనార్టీ ఓట్లను దక్కించుకోవటానికి చంద్రబాబు సైతం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అసద్ తో జరిగిన కీలక భేటీ తో రాజకీయంగా మరింత ప్రాధాన్యత పెరిగింది.
భేటీలో ఏం జరిగింది.. అడుగులు ఎటు..
ఏపిలో జగన కు మద్దతిస్తానని ఎంఐఎం అధినేత అసద్ ఓపెన్గానే ప్రకటించారు. ఇక, ఏపిలో ఎంఐఎం అమలు చేయాల్సిన కార్యాచరణ పై స్థానికంగా కొందరు ముస్లిం నేతలకు సమాచారం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వైసిపి ఎమ్మెల్యే..జగన్ సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి హైదరాబాద్ లో అసద్ తో సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు వారిద్దరి భేటీ జరిగింది. ఇది పార్టీ ప్రతినిధులుగా జరిగి న సమావేశమా..లేక వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్లో భాగంగా జరిగిన సమావేశమా అనే చర్చ జరుగుతోంది. కానీ, ఏపిలో తాము రావటం ఖాయమని ఎంఐఎం చెబుతున్నారు. ముస్లిం మైనార్టీలు ప్రభలంగా ఉన్న ప్రాంతాల్లో వైసిపి కి అనుకూల ప్రచారం చేస్తామంటున్నారు. దీంతో, ఈ సమావేశంలో ఆ దిశగానే చర్చలు సాగినట్లు తెలుస్తోంది.
వ్యూహం ఖరారైందా..జగన్ ప్రతినిధిగానే..!
అసద్- గౌతం రెడ్డి మధ్య నాలుగు గంటల పాటు సాగిన చర్చ కేవలం వ్యక్తిగత సంబంధాల్లో భాగమే కాదని..అందులో జగన్ ప్రతినిధిగా పలు అంశాలను గౌతం ఎంఐఎం అధినేత ముందుంచారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఏపిలోని ముస్లిం మైనార్టీలు జగన్ కు మద్దతుగా నిలిచారు. అయితే, తాజాగా టిడిపి- కాంగ్రెస్ తో పొత్తు, వైసిపి ని బిజెపి మిత్ర పక్షమనే ప్రచారం, ముస్లిం మైనార్టీల కోసం ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత మేర ముస్లిం ఓటింగ్ లో వైసిపికి ప్రతికూలత చూపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ముస్లిం ఓట్ల ఆకర్షణ కోసం వారి ప్రతినిధిగా జాతీయ స్థాయిలో పేరున్న అసద్ ఎన్నికల సమయంలో ఏపిలో పర్యటించేలా ఈ చర్చ సాగినట్లు తెలుస్తోంది. గతంలో వైయస్ తో సన్నిహితంగా మెలిగిన అసద్.. ఇప్పుడు జగన్ తోనూ సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, అసద్ ఏపిలో వైసిపికి మద్దతుగా ప్రచారం చేస్తే..ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో మొదలైంది.